ఆ లెటర్ రాసింది వివేకానే, చేతిరాత ఆయనదేః ధృవీకరించిన కడప ఎస్పీ
Recommended Video
కడపః రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, మాజీ లోక్ సభ సభ్యుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంలో కడప జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ దేవ్ శర్మ కీలక ప్రకటన చేశారు. పులివెందులలో వైఎస్ వివేకానంద రెడ్డి భౌతికకాయం వద్ద లభించిన ఉత్తరం.. ఆయన రాసిందేనని ఎస్పీ ధృవీకరించారు.
మొదట్లో ఈ ఉత్తరాన్ని వివేకా కుటుంబ సభ్యులు పోలీసులకు చూపలేదని ఆయన తెలిపారు. ఈ లెటర్ బయటికి పొక్కితే కారు డ్రైవర్ ప్రసాద్ ప్రాణానికి హాని కలుగుతుందనే భయంతో తాము ఈ ఉత్తరాన్ని భద్రపరిచామని వివేకా కుటుంబ సభ్యురాలు డాక్టర్ సునీత పోలీసులకు వివరించినట్లు ఎస్పీ తెలిపారు. ఉత్తరాన్ని ఎందుకు పోలీసులకు ఇవ్వలేదంటూ డీఐజీ సైతం వారిని ప్రశ్నించారని చెప్పారు. వివేకా రాసినట్టుగా చెబుతున్న ఉత్తరాన్ని ఆయన వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి తన వద్దే ఉంచుకున్నారని సునీత పోలీసుల విచారణలో వెల్లడించినట్లు చెప్పారు.
తాను సంఘటనా స్థలానికి వచ్చేంత వరకూ ఉత్తరం విషయాన్ని బయటికి తెలియనివ్వవద్దని తానే కృష్ణారెడ్డికి సూచించినట్లు సునీత పోలీసులకు వివరించారని ఎస్పీ వెల్లడించారు. చేతిరాత తన తండ్రిదేనని సునీత అంగీకరించారని, ఇదివరకు వివేకా రాసిన కొన్ని నమూనాలను తీసుకుని సరిపోల్చి చూశామని చెప్పారు. అయినప్పటికీ.. సంఘటనాస్థలంలో లభించిన లెటర్ తో పాటు తాము సేకరించిన చేతిరాత నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించామని రాహుల్ దేవ్ తెలిపారు.
ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం అమిత్ గర్గ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని, అన్ని కోణాల నుంచీ దర్యాప్తు చేస్తామని చెప్పారు. హత్య చోటు చేసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా 20 మందిని విచారించామని అన్నారు. సిట్ ద్వారా అయిదు, జిల్లా పోలీసుల నుంచి ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వివరించారు. గుండెపోటుతో వివేకా కన్నుమూశారనే వార్త ఎందుకు వచ్చిందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామని అన్నారు.