వైసీపీ రెడ్లకు గడ్డుకాలం ? ఓవైపు బీసీలు, మరోవైపు ఎస్సీలు-జగన్ ను కాదనలేక మౌనంగా!
ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో రెడ్డి సామాజిక వర్గానిది కీలకపాత్ర. తొలిసారి బీసీలు వైసీపీవైపు మొగ్గినా, ఎప్పటినుంచో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అండగా ఉన్నప్పటికీ రెడ్డకు ఉన్న ప్రాధాన్యత వేరు. మిగతా సామాజిక వర్గాలతో పోలిస్తే రెడ్లు జగన్ ను ఓన్ చేసుకున్న విధానం ప్రభుత్వ ఏర్పాటులో చాలా కీలకం. కానీ అదే రెడ్లు ఇప్పుడు అసంతృప్తితో ఉన్నట్లు అర్ధమవుతోంది. ముఖ్యంగా జగన్ సర్కార్ బీసీలు, ఎస్సీలకు ఇస్తున్న ప్రాధాన్యంతో పోలిస్తే తమను పట్టించుకోవడం లేదనే భావన వారిలో పెరుగుతోంది.
రెడ్ల పార్టీగా వైసీపీ
రాష్ట్ర జనాభాలో కేవలం నాలుగైదు శాతం మాత్రమే ఉన్న రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా మాత్రం ప్రభావవంతంగా ఉంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన ఈ సామాజిక వర్గం గత దశాబ్దకాలంగా మాత్రం వైసీపీ వైపు మొగ్గింది. ముఖ్యంగా 2014లో జరిగిన ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి రెడ్లు గంపగుత్తగా వైసీపీవైపు మొగ్గారు.
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ నెల్లూరు వంటి జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ వెనుక ఉన్నది రెడ్లే. మరి అలాంటి రెడ్లు తమ సొంత ప్రభుత్వంలో ఉక్కపోతగా ఫీలవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
బీసీలు, ఎస్సీలవైపు జగన్ మొగ్గు
రాష్ట్ర జనాభాలో బీసీలు దాదాపు 50 శాతం ఉన్నారు. అలాగే ఎస్సీలు సైతం 26 శాతంగా ఉన్నారు. ఈ లెక్కన చూస్తే రాష్ట్రంలో మూడో వంతు జనాభా ఈ రెండు సామాజికవర్గాలదే. అటువంటప్పుడు అధికారం కూడా వారికే కట్టబెడితే తన ప్రభుత్వం ఎక్కువకాలం అధికారంలో ఉంటుందని జగన్ భావిస్తున్నారు. దీంతో వీరికే మంత్రి పదవులతో పాటు అన్ని పదవుల్లోనూ ప్రాధాన్యం కల్పిస్తున్నారు.
ఇది అంతిమంగా రెడ్డి సామాజిక వర్గానికి కంటగింపుగా మారుతోంది. ముఖ్యంగా మిగతా పదవుల పరిస్ధితి ఎలా ఉన్నా సొంత ప్రభుత్వ కేబినెట్ లో మాత్రం కేవలం నాలుగు మంత్రి పదవులు మాత్రమే దక్కడం వారిలో అసంతృప్తికి కారణమవుతోంది.
కాకాణి, అనిల్ మధ్య వివాదంలోనూ
తాజాగా కేబినెట్ ప్రక్షాళన తర్వాత నెల్లూరు జిల్లా నుంచి మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కు ఉద్వాసన పలికి అదే జిల్లా నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి జగన్ మంత్రిగా అవకాశం కల్పించారు. అప్పటికే జిల్లాలో అనిల్ వర్సెస్ రెడ్లుగా ఉన్న రాజకీయాన్ని జగన్ బీసీ మంత్రి స్ధానంలో రెడ్డి మంత్రికి అవకాశం ఇచ్చి టర్నింగ్ పాయింట్ ఇచ్చారు.
దీంతో నెల్లూరు జిల్లాలో రెడ్లలో ఉన్న అసంతృప్తి కాస్తయినా తగ్గుతుందని జగన్ భావించారు. కానీ ఇప్పుడు కాకాణికి మంత్రి పదవి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని బీసీ నేత అనిల్ ఆయనపై వార్ మొదలుపెట్టేశారు. దీంతో కాకాణిని సమర్ధిస్తే బీసీలు దూరమవుతారని భావిస్తున్న జగన్, అనిల్ ను సమర్ధించలేక, కాకాణిని అదుపులో పెట్టలేక ఇరువురికీ నచ్చజెప్పేపనిలో బిజీగా ఉన్నారు. తాజాగా ఏప్రిల్ 17న ఇద్దరూ పోటాపోటీగా నెల్లూరులో పెట్టిన సభలే ఇందుకు నిదర్శనం.
నారాయణస్వామి కామెంట్స్ చిచ్చు
తాజాగా జగన్ ను పొగిడే క్రమంలో మరోసారి మంత్రి పదవి దక్కించుకున్న చిత్తూరు జిల్లా ఎస్సీ నేత నారాయణస్వామి ఈ ప్రభుత్వంలో రెడ్లది కాదని బలహీనవర్గాలదే అంటూ కుండబద్దలు కొట్టారు. అసలే రాయలసీమ జిల్లాల్లో ఉన్న రెడ్లు బీసీలు, ఎస్సీల ముసుగులో తాము అధికారానికి దూరమవుతున్నామని బాధపడుతుంటే ఇప్పుడు నారాయణస్వామి ఏకంగా రెడ్లు సైతం తాము ఎస్సీలుగా పుడితే బాగుండేదనే భావనలో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ ప్రభుత్వంలో రెడ్లు సైతం ఎస్సీలుగా పుట్టాలనుకుంటున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వైసీపీలో నెలకొన్న పరిస్దితికి నారాయణ స్వామి వ్యాఖ్యలు అద్దం పట్టాయనే వాదన వినిపిస్తోంది.
జగన్ ను కాదనలేక రెడ్లు అలా..
జగన్ సర్కార్ అధికారంలోకి రావడంలో ఎవరి పాత్ర ఎంత ఉందనేది కాసేపు పక్కనబెడితే తమ రెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతుంటే తమకు అవకాశాలు రావడం లేదనే భావన రెడ్లలో పెరుగుతుందనేది వాస్తవం. ఇప్పటికే ప్రభుత్వాన్ని రెడ్లతో నింపేస్తున్నారంటూ టీడీపీ లెక్కలు తీస్తుంటే తమకు దక్కినవన్నీ చిన్న పదవులే అన్న బాధ రెడ్లలో కనిపిస్తోంది.
దీంతో వారు అటు జగన్ ను కాదనలేక, అలాగని రచ్చకెక్కలేక నలిగిపోతున్నారు. ఇదే పరిస్దితి కొనసాగితే జగన్ సర్కార్ పై తాము పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరి కావడం ఖాయమనే భావనలో రెడ్లు ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీకి రెడ్లు గతంలోలా మద్దతివ్వాలంటే మాత్రం జగన్ పునరాలోచన చేయాలనే వాదన వారి నుంచి వినిపిస్తోంది.