రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు-అటు వైపు అస్సలు వెళ్లొద్దు..!
నిత్యం రద్దీగా ఉండే విజయవాడ నగరం రేపు మరింత రద్దీగా మారబోతోంది. నగరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ఇవాళ కీలక ప్రకటన చేశారు. రేపు ఒక్క రోజు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించాలని పోలీసులు కోరుతున్నారు. ఇంతకీ ఆ కార్యక్రమం ఏంటి ? ఏయే రోడ్లలో ఆంక్షలు విధించారో ఓసారి చూద్దాం..
విజయవాడ నగరంలో రేపు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు మీద తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ మ్యూజికల్ నైట్ నిర్వహిస్తోంది. నగరంలోని బందరు రోడ్డులో ఉన్న ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం దీనికి వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు వీఐపీలు, సాధారణ ప్రజలు హాజరు కాబోతున్నారు. దీంతో ట్రాఫిక్ రద్దీని ఎదుర్కొనేందుకు పోలీసులు ఆంక్షలు విధించారు.

రేపు (శనివారం) మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ నగరంలో కంట్రోల్ రూమ్ నుంచి బెంజిసర్కిల్ వైపు వెళ్లే అన్ని వాహనాల రాకపోకలు నిలిపేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ఈ వాహనాల్ని ఆర్టీసీ వై జంక్షన్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు రింగ్, బెంజి సర్కిల్ వైపు మళ్లిస్తారు. అలాగే ఆర్టీసీ వై జంక్షన్ నుంచి బందర్ లాకులు, రాఘవయ్య పార్క్, పాత ఫైర్ స్టేషన్ రోడ్డు, అమెరికన్ హాస్పిటల్ మీదుగా స్క్యూ బ్రిడ్జి, బెంజిసర్కిల్ కు మళ్లిస్తారు.
అలాగే బెంజి సర్కిల్ నుంచి బందరు రోడ్డులోకి వచ్చే వాహనాలు ఫకీర్ గూడెం, స్క్యూబ్రిడ్జి వైపు నుంచి బస్టాండ్ కు మళ్లిస్తారు. రెడ్ సర్కిల్ నుంచి ఆర్టీఏ జంక్షన్, శిఖామణి సెంటర్, వెటర్నరీ ఆస్పత్రి వరకూ వాహనాలు అనుమతించరు. ఆర్టీసీ బస్సుల్ని మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఆర్టీసీ వై జంక్షన్ నుంచి బెంజి సర్కిల్ వైపు అనుమతించరు. అలాగే ఆర్టీసీ వై జంక్షన్ నుంచి బందరు రోడ్డు, 5 నంబర్ రూట్ కు వెళ్లే బస్సుల్ని ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు రింగ్, అలాగే బెంజి సర్కిల్ కు పంపుతారు.












Click it and Unblock the Notifications