గృహప్రవేశం జరగాల్సిన ఇంట విషాదం; కరెంట్ షాక్ తో నలుగురు మృతి!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం కానుగమాకులపల్లెలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎంతో సంతోషంగా గృహప్రవేశం చేయడానికి అందరినీ ఆహ్వానించుకుని గృహప్రవేశం చేస్తున్న ఆ ఇంట కరెంటు తీగలు తెగిపడడంతో నలుగురు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. సంతోషంగా వేడుక జరుపుకునే ఇంట దీంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పెద్దతిప్ప సముద్రం మండలం కానుక మాకులపల్లెలో ఓ కుటుంబం కొత్తగా నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశానికి సిద్ధం అయ్యింది. బంధువులు అంతా ఈ వేడుకకు రావటంతో హడావిడిగా ఉంది. అయితే అదే సమయంలో ఆ ఇంట వేసిన షామియానా గాలికి కరెంటు తీగలపై పడింది. దీంతో ఒక్కసారిగా కరెంటు తీగలు తెగి అక్కడ ఉన్న వారిపై పడడంతో వారికి విద్యుత్ షాక్ తగిలింది.

ఏం జరుగుతుందో ఊహకు కూడా అందకుండా క్షణాల్లోనే దారుణం జరిగిపోయింది. ఈ ప్రమాద ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని వెంటనే బి కొత్తకోట మండలంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు.
మృతులను 75 సంవత్సరాల లక్ష్మమ్మ, 48 సంవత్సరాల శాంతమ్మ, 53 సంవత్సరాల లక్ష్మన్న, 26 సంవత్సరాల ప్రశాంత్ గా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో వేడుక జరుగుతున్న ఆ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల రోదనలతో ఆ ప్రాంతం అంతా మారుమోగుతోంది. శుభాకార్యం జరగాల్సిన ఇంట విషాద ఘటనతో చావు డప్పులు మోగాయి.












Click it and Unblock the Notifications