ఆదోని రైల్వే స్టేషన్ లో కామెడీ...
స్టేషన్లో రైలు ఆపకపోవడంతో ప్రయాణికులు పరుగులు పెట్టారు. కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. ముంబయి నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్ ప్రెస్ 22179 ఆదోనికి తెల్లవారుజామున 1.40 గంటలకు వచ్చింది. ఆదోని మీదుగా చెన్నై, కడప, రేణిగుంట, తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు స్టేషన్కు చేరుకున్నారు. బండి 5 గంటలు ఆలస్యంగా ఉదయం 6.40 గంటలకు స్టేషన్ కు వచ్చింది.
రైలు స్టేషన్ కు వచ్చిన సమయంలో సిబ్బంది ఎటువంటి ప్రకటనా చేయలేదు. వాస్తవానికి అందరూ అనౌన్స్ మెంట్ ను బట్టి ఏ ప్లాట్ ఫారంపైకి వెళ్లాలి? ఎన్ని గంటలకు బండి వస్తుంది? అనే సమాచారాన్ని ప్రయాణికులు తెలుసుకుంటారు. రైల్వేస్టేషన్ అంటేనే అనౌన్స్ మెంట్. కానీ ప్రయాణికులు చూస్తుండగానే చెన్నై ఎక్స్ ప్రెస్ వెళ్లిపోయింది. బండి వచ్చే సమాచారాన్ని చెప్పలేదు.. ప్లాట్ ఫాంపై నిలిచే బోగీల సంఖ్యను కూడా చూపించలేదు.

బండి ఆగకుండా వెళ్లిపోతుండటంతో ప్రయాణికులు కేకలు వేస్తూ రైలు వెంట పరుగులు తీయడంతో గార్డు అప్రమత్తమయ్యారు. వెంటనే లోకో పైలట్ కు సమాచారం ఇచ్చారు. దీంతో స్టేషన్ కు కిలోమీటరు దూరంలో రైలు నిలిచింది. కొందరు ప్రయాణికులు అక్కడికి వెళ్లిన తర్వాత గార్డుతో వాగ్వాదానికి దిగారు. స్టేషన్ మాస్టర్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో రైలు ఆపలేదని గార్డు ప్రయాణికులకు చెప్పారు. ఈ విషయంపై ఆదోని స్టేషన్ మేనేజర్ వెంకటేశులును వివరణ కోరగా ఈ నెల మొదటి వారం వరకు ఈ రైలు ఆదోని స్టేషన్లో ఆగేది కాదని.. ఇటీవల నుంచి స్టేషన్ లో ఆగుతున్న విషయం కొత్తగా బాధ్యతలు చేపట్టిన స్టేషన్ మాస్టర్కు తెలియకపోవడంతో సిగ్నల్ ఇవ్వలేదని వివరించారు.












Click it and Unblock the Notifications