బద్వేల్లో పోటీకి కాంగ్రెస్ కూడా రెడీ-వైసీపీ ఏకగ్రీవానికి మరో ఎదురుదెబ్బ- ముక్కోణపు పోటీ
కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక రాజకీయం ట్విస్టుల మీద ట్విస్టులుగా సాగిపోతోంది. అంతా అనుకున్నట్లు వైసీపీ చేసిన ఏకగ్రీవ ప్రతిపాదనకు టీడీపీ, జనసేన మద్దతు పలికాయి. దీంతో అక్కడ ఉపఎన్నిక రాజకీయం ముగిసిపోయిందని అనుకుంటున్న తరుణంలో బీజేపీ ముందుగా తాము పోటీ చేస్తామని ప్రకటించి ట్విస్ట్ ఇచ్చింది. దీనికి కొనసాగుంపుగా ఇవాళ కాంగ్రెస్ కూడా తమ అభ్యర్ధిని నిలపాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక్కడ ముక్కోణపు పోటీ తప్పేలా లేదు.
సీఎం జగన్ సొంత జిల్లా కడప పరిధిలోకి వచ్చే బద్వేలు నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో వైసీపీ అక్కడ ఆయన భార్య డాక్టర్ సుధను పోటీకి నిలబెట్టింది. అంతే కాదు ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసుకునేందుకు విపక్షాలు ముందుకొస్తే ఆహ్వానిస్తామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. దీంతో స్పందించిన టీడీపీ, జనసేన తమ అభ్యర్ధుల్ని పోటీకి పెట్టబోమని, ఏకగ్రీవానికి సహకరిస్తామని చెప్పేశాయి. అక్కడితో బద్వేల్ ఉపఎన్నిక రాజకీయం ముగిసిపోయినట్లేనని అంతా భావించారు.

సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ అభ్యర్ధిపై తాము పోటీ చేసి తీరుతామని బీజేపీ నేత సోము వీర్రాజు నిన్న ప్రకటించారు. అనంతరం ఇవాళ పీసీసీ ఛీఫ్ శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని బరిలోకి దింపుతామని వెల్లడించారు. ఇరు పార్టీలు ఇంకా అభ్యర్ధుల్ని ప్రకటించకపోయినా పోటీ చేయడం మాత్రం ఖాయమైంది. దీంతో బద్వేల్లో ఏకగ్రీవం సంగతి దేవుడెరుగు ముక్కోణపు పోటీ తప్పేలా లేదు. అయితే ఓట్లు, క్షేత్రస్ధాయిలో పరిస్ధితుల ఆధారంగా చూస్తే మాత్రం వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధ విజయం నల్లేరుపై నడకలాగానే కనిపిస్తోంది. అయితే ఎన్నికకు వెళ్లకుండా ఏకగ్రీవం చేసుకుందామన్న వైసీపీ వ్యూహాలకు మాత్రం ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన పోటీ చేయకున్నా.. బీజేపీ, కాంగ్రెస్ రంగంలోకి దిగడం ద్వారా సీఎం సొంత జిల్లాలో ఉపఎన్నిక ఏకగ్రీవం కానీయకుండా అడ్డుపడగలిగాయి. దీంతో ఈ రెండు జాతీయ పార్టీల నిర్ణయాలు ఇప్పుడు వైసీపీకి చికాకుగా మారబోతున్నాయి.












Click it and Unblock the Notifications