చిక్కుల్లో జగన్ కేబినెట్ మంత్రి ? కేంద్ర దర్యాప్తు సంస్ధకు ఆ కీలక కేసు దర్యాప్తు !
ఏపీలో వైఎస్ జగన్ కేబినెట్ మంత్రి ఒకరు ఓ కీలక కేసులో కొంతకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టు అదే అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఆయనపై ఎంత మేరకు ప్రభావం చూపుతుందో లేదో తెలియదు కానీ రాష్ట్రంలో మాత్రం చర్చనీయాంశం మాత్రం అవుతోంది.
కొంతకాలం క్రితం నెల్లూరు జిల్లా కోర్టులో కీలక ఫైల్స్ మిస్సయ్యాయి. వీటిపై విచారణ జరిపిన పోలీసులు.. దొంగలు ఎత్తుకెళ్లారని తేల్చారు. అయితే దీనిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి కారణం జిల్లాకు చెందిన సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి చెందిన ఓ కేసు ఫైల్స్ కావడమే. ఈ ఫైల్స్ మిస్సింగ్ తో కాకాణి సదరు కేసు నుంచి బయటపడే అవకాశం ఉందని విపక్షాలు అనుమానిస్తున్నాయి. దీంతో కాకాణి విమర్శలకు కేంద్ర బిందువుగా మారారు. అయితే ఆ తర్వాత ఆయన జగన్ కేబినెట్లో వ్యవసాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అయితే నెల్లూరు కోర్టులో ఫైల్స్ మిస్సింగ్ కేసు మాత్రం పోలీసులు విచారణ చేస్తూనే ఉన్నారు. అయినా ఎలాంటి పురోగతి లేదు. దీంతో జిల్లా కోర్టు జడ్జిని హైకోర్టు నివేదిక కోరింది. దీనిపై నివేదిక ఇచ్చిన సదరు కోర్టు జడ్డి సీబీఐ విచారణ జరిపిస్తే తప్ప ఇందులో నిజానిజాలు బయటికి వచ్చే అవకాశం లేదని తెలిపారు. దీన్ని సుమోటో కేసుగా పరిగణించిన హైకోర్టు.. ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు కోర్టు ఫైల్స్ మిస్సింగ్ కేసుపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి పాత్రను సీబీఐ తేల్చబోతుందా, ఆయన్ను విచారణకు పిలిపించి నిజానిజాలు విచారిస్తారా అన్న అంశం ఉత్కంఠ రేపుతోంది.
మరోవైపు హైకోర్టు నిర్ణయాన్ని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్వాగతించారు. తనకు నీతి, నిజాయితీ ఉంది కాబట్టే సీబీఐ విచారణకు భయపడకుండా స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీబీఐ విచారణతో వాస్తవాలు బయటికి వస్తాయన్న నమ్మకం ఉందన్నారు. అంతేకాకుండా తనను విమర్శిస్తున్న టీడీపీ నేతల నోర్లు మూతపడతాయన్నారు. చంద్రబాబులా విచారణకు భయపడి తాను పారిపోనని, ఏ తప్పూ చేయలేదు కాబట్టి హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కాకాణి వెల్లడించారు.