సిఎంకు రాజకీయ సన్యాసమే: కెటిఆర్, టి ఆగదు: హరీష్
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును వెనక్కి పంపాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటీసును స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందినట్లు ప్రకటించడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు తీవ్రంగా తప్పు పట్టారు. తీర్మానాన్ని ఓడించామని చెప్పడం వల్ల ఒరిగేది గానీ జరిగేది గానీ ఏమీ లేదని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. తెలంగాణ ఆగబోదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. బిల్లును రాష్ట్రపతికి పంపించడంలో తాము విజయం సాధించామని ఆయన అన్నారు. బిల్లు గెలిచిందా, లేదా అనేది అనవసరమని, పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన అన్నారు.
శాసనసభలో ఈ రోజు ప్రహనసం ముగిసిందని తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు అన్నారు. ఏడు వారాలుగా జరిగిన ప్రహసనం ముగిసిందని ఆయన అన్నారు. స్పీకర్, ముఖ్యమంత్రి కుమ్మక్కయి పరిష్కారాలు అన్వేషించకుండా దొడ్డిదారిలో సభ బిల్లును వ్యతిరేకించందంటూ పైశాచికానందం పొందారని ఆయన వ్యాఖ్యానించారు. పైశాచికానందం పొందడానికి మాత్రమే తీర్మానాన్ని నెగ్గించుకున్నామని చెప్పారని ఆయన అననారు.

తీర్మానాన్ని నెగ్గించుకున్నామనేది పనికిమాలిన పసలేని ప్రయత్నం మాత్రమేనని ఆయన అన్నారు. తీర్మానం నెగ్గిందని చెప్పి తెలంగాణ ఆగుతుందని అనుకోకూడదని ఆయన అన్నారు. తెలంగాణ ఆగుతుందని అపోహ పడవద్దని ఆయన సూచిచంారు. ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డికి రాజకీయ సన్యాసం తప్పదని, స్పీకర్ నాదెండ్ల మనోహర్కు ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో శాసనసభ పాత్ర నామమాత్రమేనని, తెలంగాణ ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు.
రేపు కెసిఆర్ ఢిల్లీ వెళ్తారని, బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించి ఆమోదం పొందేలా కెసిఆర్ ప్రయత్నాలు చేస్తారని ఆయన అన్నారు. ఫిబ్రవరి రెండోవారంలో తెలంగాణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల ముందుకు వస్తుందని ఆయన చెప్పారు. గెలిచామని వారు పైశాచికానందం పొందితే వారి మానాన వారిని వదిలేయాలని ఆయన అన్నారు. చర్చ పూర్తయిందని స్పీకర్ చెప్పారని, అందువల్ల ఇక తెలంగాణ ఆగే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. సిఎం ఇచ్చిన నోటీసు మేరకు సభ ఆమోదించిన తీర్మానం నాలుక గీసుకుని పారేయడానికి కూడా పనికి రాదని ఆయన అన్నారు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారనేది పార్లమెంటులో తేలుతుందని ఆయన అన్నారు.
తెలంగాణ బిల్లుపై శాసనసభకు అభిప్రాయం చెప్పే హక్కు మాత్రమే ఉంటుందని స్పీకర్ బిఎసి సమావేశంలో చెప్పారని, అందుకు విరుద్ధంగా సిఎం తీర్మానాన్ని ప్రవేశపెట్టి నెగ్దిందని ప్రకటించారని ఎస్ వేణుగోపాలాచారి అన్నారు. సీమాంధ్రలో హీరో కావడానికి దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా కిరణ్ కుమార్ రెడ్డి కుట్ర చేసి పైశాచికానందం పొందుతున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజల ఆరు దశాబాద్ల కల, తెరాస 13 ఏళ్ల పోరాటం ఫలించిందని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. బిల్లు రాష్ట్రపతికి వెళ్తున్నందుకు సంతోషిస్తున్నామని ఆయన అన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన అన్నారు. కుట్రపూరితంగా, దుర్మార్గంగా, మూర్ఖంగా ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి నిబంధనలను విరుద్ధంగా తీర్మానాన్ని ప్రతిపాదించారని ఆయన అన్నారు. స్పీకర్ సీమాంధ్ర పక్షపాత వైఖరిని అవలంబించారని ఆయన విమర్శించారు. దొంగలాగా మూజువాణీ ఓటుతో తీర్మానం గెలిచిందని చెప్పారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications