కాంగ్రెస్ ఇవ్వలేదు, ఇక తెరాస అంటే... : టిపై కెటిఆర్
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదని... ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఇప్పటి వరకు తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని, ఇప్పుడు తెలంగాణ సాధించాం కాబట్టి.. ఇక నుండి తిరుగులేని రాజకీయ శక్తిగా తమ పార్టీ ఉంటుందన్నారు.
దాదాపు ప్రతి రాష్ట్రంలో ఆయా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పార్టీలు ఉన్నాయని, అలాంటప్పుడు తెలంగాణ వారి ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటుందన్నారు. తమ పార్టీని ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. తాము ఒంటరిగా వెళ్లినా, ఎవరితోనైనా పొత్తులు పెట్టుకున్నా ప్రజలు తమను గెలిపిస్తారన్నారు. భావసారూప్యం గల పార్టీలతో పొత్తుకు సిద్ధమన్నారు.
తెరాస విలీనం కాకపోయినా తాము వంద అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాలలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న తెలంగాణ కాంగ్రెసు నేతలు విలీనం కోసం ఎందుకు పాకులాడుతున్నారని ప్రశ్నించారు. అన్ని స్థానాల్లో గెలిచే దమ్ముంటే తమతో పనేమిటని ప్రశ్నించారు.
కాంగ్రెసు పార్టీ అరవై ఏళ్లుగా తెలంగాణ ప్రజలను ఇబ్బందులు పెట్టిందని మండిపడ్డారు. కాంగ్రెసు తెలంగాణ ఇచ్చిందనడం కంటే ఇవ్వాల్సి వచ్చిందనడం ఉత్తమమన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెసు మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారని చెప్పారు. కాంగ్రెసు పార్టీ నేతలకు తెలంగాణ అనే పదం ఉచ్చరించే నైతిక హక్కు లేదన్నారు. ఎన్నికల ప్రచారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.