నో: విలీనంపై తేల్చిన కెసిఆర్, రూటు మారనున్న తెరాస
హైదరాబాద్: పార్టీ విలీనంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం పార్టీ నాయకులకు స్పష్టత ఇచ్చారు. కాంగ్రెసు పార్టీలో విలీనం ఉండదని తేల్చేశారు. మధ్యాహ్నం తెరాస రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది.
ఈ సమావేశంలో కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసులో తెరాస విలీనం కాదని చెప్పారు. విలీనంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని నేతలకు సూచించారు. పొత్తుల అంశాన్ని ఎన్నికల సమయంలో నిర్ణయించుకుందామని తేల్చి చెప్పారు. షరతులు లేని తెలంగాణ ఇస్తే అప్పుడు కాంగ్రెసుతో వెళ్లే విషయం ఆలోచించుదామని చెప్పినట్లుగా తెలుస్తోంది.
హైదరాబాదుతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పునర్నిర్మాణంలో తెరాస పాత్ర ఉంటుందన్నారు. తెరాసతోనే అభివృద్ధి సాధ్యమని తెలంగాణ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు తెరాస పునర్నిర్మాణంలో పాత్ర పోషించాలని కోరుకుంటున్నారన్నారు.
రూటు మార్చనున్న తెరాస
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన తెరాస ఇక నుండి రూటు మార్చనుందట. ఇన్నాళ్లు రాష్ట్ర సాధన కోసమే ప్రధానంగా ఉద్యమించింది. ప్రజా సమస్యలు పట్టకుండా తెరాస పోతుందనే విమర్శలను కూడా ఇతర పార్టీలు చేశాయి. అయితే ఇప్పుడు రాష్ట్రాన్ని సాధించిన నేపథ్యంలో పార్టీ రూటు మార్చనుందంటున్నారు.
ఇక పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలుపంచుకోనుంది. నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు వర్షం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. రేపటి నుండి వారు జిల్లాల్లో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు.