కేవీపీ బిల్లుపై కేటీఆర్ కొలికి : వెంకయ్య రాయబారమేనా..?
న్యూఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా నిమిత్తమై జూలై 22న కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టబోతున్న ప్రైవేటు మెంబర్ బిల్లుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకరకంగా పార్టీలకు అతీతంగా ఏపీలోని రాజకీయ శక్తులన్ని కేవీపీ బిల్లుకు మద్దతునివ్వాల్సిన పరిస్థితి. మరోవైపు అధికార టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ మాత్రం బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ప్రైవేటు బిల్లుపై టీఆర్ఎస్ మద్దతు కోరినట్టుగా వార్తలు వస్తుండగా.. టీఆర్ఎస్ శ్రేణుల నుంచి మాత్రం భిన్నమైన స్పందన వస్తోంది.
టీఆర్ఎస్ ఎటువైపు..?
ప్రైవేటు బిల్లు మద్దతుపై రఘువీరా ప్రతిపాదనకు టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు మద్దతునిస్తాం అని చెప్పగా, మంత్రి కేటీఆర్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. కేవీపీ ప్రవేశపెట్టబోయే బిల్లుతో ఏపీకి ఏం ఒరుగుతుందని ప్రశ్నించారు కేటీఆర్.
బుధవారం ఢిల్లీ మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే, కేవీపీ బిల్లుకు మద్దతునిస్తాం అని తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు కేటీఆర్. కేసీఆర్ దేశంలోని 36 పార్టీలను ఏక తాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, ప్రైవేటు బిల్లుల ద్వారా ఏపీకి వచ్చే లాభమేంటని ప్రశ్నించారు.
జిమ్మిక్కులతో ప్రజలను మభ్య పెట్టాలనుకోవడం.. కాంగ్రెస్ పార్టీ అవివేకానికి నిదర్శమన్న కేటీఆర్, కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉంటే అన్ని పార్టీల్లో ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు క్రుషి చేయాలన్నారు. కేవీపీ తలకిందులుగా తపస్సు చేసినా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కేవీపీ ప్రైవేటు బిల్లు సంగతి పక్కనబెడితే హైకోర్టు విభజనకు సంబంధించి ఎవరైనా బిల్లు పెడితే మద్దతునిస్తానన్నారు.
వెంకయ్య రాయబారమేనా..?
కేవీపీ బిల్లు వల్ల ఒరిగేదేమి లేదన్న కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో.. దీని వెనుక కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హస్తం ఉందా..? అన్న గుసగుసలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కేవీపీ ప్రైవేటు బిల్లు పాసయితే బీజేపీ ఇరుకున పడే అవకాశం ఉండడంతో.. టీఆర్ఎస్ తో వెంకయ్య రాయబారం నడిపారా అన్న సంశయాలు తెరపైకి వస్తున్నాయి.
యూపీఏ ఎన్డీయేలతో సంబంధం లేని ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్, అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల నిర్ణయం ప్రైవేట్ బిల్లు విషయంలో కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు.. స్మృతిఇరానీతో భేటీ
రాష్ట్రంలో చేనేత పరిస్థితి గురించి చర్చించడానికి కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి స్మృతిఇరానీతో భేటీ అయిన కేటీఆర్, సమావేశం అనంతరం కాంగ్రెస్ పై మండిపడ్డారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ ఓ పనికిమాలిన పార్టీ అని ఎద్దేవా చేశారు. అలాగే తెలంగాణను హర్యానా నీటి ప్రాజెక్టులతో పోల్చడం కాంగ్రెస్ అవివేకమని, దీన్నిబట్టి కాంగ్రెస్ పనికిమాలిని పార్టీ అని అర్థమవుతోందన్నారు.
ఇక బేటీ విషయానికొస్తే.. త్వరలోనే చేనేత రంగ నిపుణులతో హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేయడానికి కేంద్రమంత్రి స్మృతిఇరానీ హామి ఇచ్చినట్లుగా తెలిపారు కేటీఆర్. అలాగే తెలంగాణలో చేనేతకు కేరాఫ్ అయిన సిరిసిల్ల, పోచంపల్లి, నారాయణ్పేట, గద్వాలలో చేనేత రంగం అభివృద్ధికి ప్రోత్సాహాం అందిస్తామని కేంద్రమంత్రి భరోసా ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.