నా దెబ్బేంటో చూపిస్తా: కెసిఆర్, తెరాసలోకి జగన్ నేతలు
మహబూబ్ నగర్: రానున్న ఎన్నికల్లో ఈ కెసిఆర్ దెబ్బేంటో రుచి చూపిస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కృష్ణమోహన్ రెడ్డి, కేశవ్లు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా గద్వాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడారు. 2009లో కెసిఆర్ పాలమూరు నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు విభజన తర్వాత మొదటి సభను పాలమూరులోనే పెట్టడం గమనార్హం.
కెసిఆర్ మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ సాధించుకోవడం చరిత్రలో లిఖించబడుతుందని చెప్పారు. తెలంగాణ కోసం పద్నాలుగేళ్లుగా యావత్ సమాజాం కష్టపడిందని, పాలమూరు గడ్డ నుండి అనేకమంది కళాకారులు ఉద్యమాన్ని బలపర్చారని చెప్పారు. మహబూబ్ నగర్ ఎంపీగా తెలంగాణ సాధించినందుకు తాను ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ఆర్డీఎస్ తూములు బాంబులతో బద్దలు కొడతామని బైరెడ్డి రాజశేఖర రెడ్డి బెదిరించారన్నారు.

ఇక పాలమూరులో కృష్ణమ్మ పరవళ్లను ఎవరు ఆపలేరన్నారు. ఆర్డీఎస్ ప్రాజెక్టు కోసం తాను నాడు యాత్ర చేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు ఎలా రావో చూస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపు తెరాసదే అన్నారు. ఈ ఎన్నికల్లో కెసిఆర్ దెబ్బేంటో చూపిస్తానని చెప్పారు. 2002లో జూరాలకు లింక్ కాలువను కలుపుతానని చెప్పిన చంద్రబాబు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. పన్నెండేళ్లు దాటినా జూరాలకు నీళ్లు ఇచ్చే దిక్కు లేదన్నారు.
పాలమూరు పచ్చగా కనిపించాలని, వలసలు నివారించబడాలని ఆకాంక్షించారు. పాలమూరు పచ్చబడే దాకా ఈ కెసిఆర్ నిద్రపోడన్నారు. గుర్రంగూడ దగ్గర మరో బ్యారేజీ నిర్మించుకొని నీళ్లు పారించుకుందామన్నారు. ఆర్డీఎస్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ వాల్మికీలను ఎస్టీల్లో చేర్చే జీవో తీసుకు వస్తామన్నారు. ఆరు నూరైనా నెట్టెంపాడును పూర్తి చేసి గద్వాలను పచ్చగా చేయాలన్నారు.
పేదరికం మీద పోరాటం చేయాలి తప్ప మనుషులు మీద కాదని కెసిఆర్ అన్నారు. గద్వాలలో రాజకీయం మారాలని పిలుపునిచ్చారు. గద్వాలలో ఫ్యాక్షన్ రాజకీయాలు పోయి, శాంతికపోతాలు ఎగరాల్సిన అవసరం ఉందన్నారు. గద్వాల్ సహా కొన్ని ప్రాంతాల్లో నడిచిన ఫ్యాక్షన్ రాజకీయాలు సరికాదన్నారు. కాంట్రాక్టు పాపం చంద్రబాబుదే అన్నారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామన్నారు.
అంగన్ వాడీ టీచర్ల సమస్యలు సంపూర్ణంగా పరిష్కరిస్తామని చెప్పారు. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండరన్నారు. పాలమూరులో పద్నాలుగు లక్షల ఎకరాలకు నీరు అందేలా చూస్తామని చెప్పారు. గద్వాలలో కృష్ణమోహన్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఆ తర్వాత గట్టు భీముడిని ఎమ్మెల్సీగా చేస్తానని చెప్పారు. ఎంపీలను, ఎమ్మెల్యేలను తెరాసనే గెలుచుకుంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు.












Click it and Unblock the Notifications