ట్రంప్, కిమ్కి సింగపూర్పై నమ్మకం...సింగపూర్ కి ఎపిపై నమ్మకం:చంద్రబాబు
అమరావతి:టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో విపక్షాలను ఎలా ఎదుర్కోవాలనేదే విషయంపై చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
పాపను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు పడే వేదన వర్ణానాతీతం.. మీ సాయం కావాలి
పార్టీ ఎమ్మెల్యేలు,ఇన్ఛార్జుల పనితీరుపై ప్రతి 45 రోజులకు 70 లక్షల మంది పార్టీ కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ..వివిధ మార్గాల్లో నివేదికలు రూపొందించడం చేస్తున్నామని...తదనుగుణంగా చర్యలూ మొదలు పెట్టానని చంద్రబాబు చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద నాయకులైన ట్రంప్, కిమ్ అతి కీలకమైన సమావేశానికి వేదికగా సింగపూర్ని ఎంచుకున్నారని...ట్రంప్, కిమ్కి సింగపూర్పై నమ్మకం ఉంటే, సింగపూర్కి ఆంధ్రప్రదేశ్పై చాలా నమ్మకం ఉందన్నారు.
"సార్ పట్టించుకోడు"...అనుకోవద్దు
టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ..."సార్ పట్టించుకోడు మన పని మనం చేసుకోవచ్చులే అనుకోవద్దు. పార్టీ గెలవడం చరిత్రాత్మక అవసరం. విపక్షాలు తప్పులు చేసినా ఎండగట్టలేకపోతున్నాం. దొంగసారా, తప్పుడు అఫిడవిట్లతో ఆస్తుల స్వాధీనం, ఇప్పుడు బెట్టింగ్లు... ఇలా పలు నేరాల్లో విపక్ష ఎమ్మెల్యేల ప్రమేయం ఉంటోంది. వాటిని బయట పెట్టాలి"...అన్నారు. ఎన్నికల నాటికి పార్టీని మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు అవసరమైన కార్యాచరణను తెలుగుదేశం సిద్ధం చేసిందని చెప్పారు.
మీరు బుకాయిస్తే...దెబ్బతింటాం
పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జుల పనితీరుపై లక్షలాది మంది కార్యకర్తల నుంచి ప్రతిరోజు అభిప్రాయ సేకరణ చేస్తున్నామని...వివిధ మార్గాల్లో నివేదికలు రూపొందిస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు..."మీరు ఇంకా బుకాయిస్తే... మీరూ, నేనూ కూడా దెబ్బతింటాం. అవసరమైతే కఠిన నిర్ణయాలూ తప్పవు. గెలవలేరనుకుంటే వేరేవాళ్లను పెట్టడానికి వెనుకాడను. రోజు పార్టీకి నాలుగు గంటల సమయం కేటాయించి, లోతుగా పరిశీలిస్తున్నా. మీరు జాగ్రత్త పడాలి. ఇకపై మీకు నా నుంచి ఎప్పుడైనా ఫోన్ రావొచ్చు...మీరు ఇబ్బంది పడినా.. రాష్ట్రం, పార్టీ, మీ ప్రయోజనాల కోసం చేయక తప్పదు. మీ తప్పులుంటే నిర్మొహమాటంగా చెబుతా. నన్ను అపార్థం చేసుకోవద్దు. ఒకటికి నాలుగుసార్లు మీకు వ్యక్తిగతంగా చెబుతా. మీరు మారకపోతే ప్రజల ముందే చెబుతా. నేను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల విశ్వాసం పొందాలి''...అని చెప్పారు.
ట్రంప్,కిమ్ కి...సింగపూర్ పై నమ్మకం
ప్రపంచంలో అత్యంత వివాదాస్పద నాయకులైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తమ శిఖరాగ్ర సమావేశానికి సింగపూర్ని వేదికగా ఎంచుకున్నారు. ఇద్దరు అగ్రనేతలకు ఆతిథ్యమిస్తొందంటే సింగపూర్ గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. ట్రంప్, కిమ్కి సింగపూర్పై నమ్మకం ఉంటే, సింగపూర్కి ఆంధ్రప్రదేశ్పై చాలా నమ్మకం ఉంది. అమరావతిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధి తమ ప్రాధాన్య కార్యక్రమం అని సింగపూర్ ప్రధానే... స్వయంగా భారత ప్రధాని నరేంద్రమోదీకి చెప్పారు'' అని ముఖ్యమంత్రి చంద్రబాబు టిడిపి నేతలకు వివరించారు.
ఈవీఎంలపై...జాగ్రత్త!
ఇదిలా వుండగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ...ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విషయంలోను పార్టీ క్యాడర్ను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని...ఈవీఎంలను కేంద్రం దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని చెప్పగా...దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఎలక్ట్రానిక్ పరికరాన్ని ట్యాంపరింగ్ చేసేందుకు అవకాశం ఉంటుందని...ఈవీఎంల విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కొంత కసరత్తు చేస్తామని చెప్పారు. తాము వేసిన ఓటు ఎవరికీ పడిందో చూసుకునే హక్కు ప్రతి ఓటరకూ ఉందని, టీడీపీ పోరాటంతోనే ఓటింగ్ యంత్రాలకు అనుబంధంగా ఓటు ఎవరికి పడిందీ చూసుకునే ప్రింటర్లను ఎన్నికల కమిషన్ వినియోగంలోకి తెచ్చిందని సీఎం తెలిపారు.
ముస్లింల ఓట్లు..తొలగింపు వార్తలు
కర్ణాటక, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల నుంచి ముస్లిం ఓటర్ల పేర్లు పెద్ద సంఖ్యలో తొలగింపునకు గురయ్యాయని వస్తున్న వార్తలను కూడా ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు లేవనెత్తారు. ‘కర్ణాటకలో తాజా ఓటర్ల జాబితాలో 18 లక్షల ముస్లిం ఓటర్ల పేర్లు మాయమయ్యాయని ‘సెంటర్ ఫర్ రిసెర్చ్ అండ్ డేటాబేస్ ఇన్ డెవల్పమెంట్ పాలసీ' అనే స్వచ్ఛంద సంస్థ తన అధ్యయనంలో తేల్చింది. 15 శాతం మంది ఓటర్ల పేర్లు తొలగించినట్లు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిణామాలు జరిగినట్లు వింటున్నాం' అని ఆయన చెప్పారు. దీంతో, ఓటర్ల జాబితాల్లో పేరు ఉన్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని, దీనిపై ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను టీడీపీ నేతలు చైతన్యపర్చాలని చంద్రబాబు సూచించారు.