TTD: తిరుమలకు తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు..!!
Tirumala: తిరుమలకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. వీరిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో అందరు ఎమ్మెల్యేలకు తిరుమలకు దర్శనం, వసతి కోసం సిఫార్సు లేఖలు ఇచ్చే అవకాశం ఉండేది. రాష్ట్ర విభజన తరువాత ఎమ్మెల్యేలకు సిఫార్సు లేఖలు ఇవ్వటం లేదు. టీటీడీ బోర్డులో తెలంగాణ కోటాలో మాత్రం సభ్యులను నియమిస్తున్నారు. తెలంగాణ మంత్రులు, ప్రముఖులకు మాత్రం వీఐపీ దర్శనం అందుతోంది.
సామాన్య భక్తులు తిరుమలకు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే సమయంలో ఎమ్మెల్యేలను లేఖలు కోరుతున్నారు. దీంతో, ఏపీ ఎమ్మెల్యేల తరహాలోనే తెలంగాణ ఎమ్మెల్యేలకు దర్శనం, వసతి కోసం సిఫార్సు లేఖలు ఇచ్చేలా అనుమతించాలని ఏపీ ప్రభుత్వం ,టీటీడీని తెలంగాణ ప్రభుత్వంలోని కొందరు సంప్రదించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. ఏపీలోని ఎమ్మెల్యేలకు కోటా విధించి..నిబంధనలకు అనుగుణంగా దర్శనం వసతి కల్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు పరిమితి సంఖ్యలో సిఫార్సు లేఖలు అనుమతించేలా చర్యలు తీసుకొనేలా సంప్రదింపులు చేస్తున్నామని కోమటిరెడ్డి వివరించారు.

ప్రస్తుతం తిరుమలలో ప్రజా ప్రతినిధులకు సంబంధించిన సిఫార్సు లేఖలను రోజుకు ఒక్కొక్కరి నుంచి ఒకటి మాత్రమే అనుమతిస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాల్లోనూ మార్పులు చేసారు. వారంలో ఒక రోజు పూర్తిగా బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలను అనుమతించటం లేదు. స్వామికి ప్రత్యేక కార్యక్రమాలు, పర్వదినాల రోజుల్లో సిఫార్సు లేఖలను స్వీకరించటం నిలిపివేస్తున్నారు. ప్రముఖులు ప్రత్యక్షంగా వస్తే వారికి దర్శనం కల్పిస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా టికెట్ల అమ్మకాలు పెరిగాయి. ఇదే సమయంలో తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల నుంచి ప్రముఖలు సిఫార్సు లేఖలతో వచ్చిన వారికి అవకాశానికి అనుగుణం గా దర్శనం కల్పిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు సిఫార్సు లేఖలు అనుమతించాలనే తాజా అభ్యర్దన పైన ఎలాంటి నిర్ణయం ఉంటుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications