కేసీఆర్‌ని అన్నారని దుమ్ము దులిపారు! వెంకయ్యతో...

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన, తెరాస ప్రభుత్వం పైన వివిధ పార్టీల నేతలు చేస్తున్న విమర్శలకు తెలంగాణ మంత్రులు ధీటుగా స్పందిస్తున్నారు. మంగళవారం మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్, హరీష్ రావులు విపక్ష నేతల పైన, ఆంధ్రప్రదేశ్ నాయకుల పైన నిప్పులు చెరిగారు.

జానారెడ్డి ఏనాడు ప్రజా సంక్షేమం కోసం చూడలేదని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా సమీక్షా సమావేశాలు ఆయన ఎప్పుడు హాజరు కాలేదని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి సీమాంధ్రులు నీటిని దోచుకుపోతుంటే పెదవి విప్పలేదన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం హయాంలోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. జానా ఆంధ్రోళ్లకు తొత్తులా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

విద్యార్థులను రెచ్చగొడుతోంది జానా రెడ్డియే అన్నారు. ఆయన మతిలేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ భవిష్యత్తు త్రిశంకు స్వర్గంలో పడిందన్నారు. జానా హయాంలోనే ఉద్యమకారుల పైన దాడులు జరిగాయన్నారు. త్వరలో నల్గొండ జిల్లా ప్రజలు జానాకు బుద్ధి చెబుతారన్నారు. వాగ్ధానాలు మినహా జానా ఒరగబెట్టిందేమీ లేదన్నారు.

TS Ministers slam parties for criticising KCR

ఎవరికి ఏది చేతనవుతుందో ప్రజలకు తెలుసునని, కొత్త రాష్ట్రానికి మేలు చేయటం కేసీఆర్‌కు చేతనవుతుందనే తమను అధికారంలో కూర్చోబెట్టారని, ఏదీ చేతకాదనే మిమ్మల్ని ప్రతిపక్షంలో ఉంచారని జానారెడ్డిపై హరీశ్ రావు ధ్వజమెత్తారు. గడిచిన పదేళ్లు మంత్రిగా ఉండి, చేసిన తప్పులన్నీ చేసి, ఇప్పుడు మమ్మల్ని అనటానికి నోరెలా వచ్చిందన్నారు. జానారెడ్డితో పాటు, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తమ పార్టీ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై స్పందించారు.

వారు ఉనికిని చాటుకోవటానికే నోటికొచ్చినట్లు చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో ప్రతికూల పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఏపీ సర్కారు, చంద్రబాబులు వెంకయ్యనాయుడును అడ్డుపెట్టుకొని, కేంద్రం సహకారంతో చిక్కులు తెస్తోందని ఆరోపించారు. వీటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌కు మంచి పేరు వస్తుంటే, విపక్ష నేతలు ఈర్షతో మాట్లాడుతున్నారన్నారు.

జనాలు వారిని మర్చిపోతున్నారనే బాధ వారి మాటల్లో కనిపిస్తోందన్నారు. పొన్నాలపై ఆధిపత్యం కోసమే అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. పొన్నాలతో ఆధిపత్యపోరులో భాగంగానే జానారెడ్డి తమ ప్రభుత్వంపై అర్థంపర్థంలేని విమర్శలు చేస్తున్నారన్నారు. రుణ మాఫీపై స్పష్టత లేదని జానారెడ్డి అంటున్నారని, మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అదే తాము అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే 43 హామీలను నెరవేర్చామన్నారు. ప్రతీ రైతుకు రుణమాఫీ ప్రకటించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.

ఆర్బీఐ చిక్కులున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, ఇందుకు ప్రశంసించాల్సిందిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతారా అని ప్రశ్నించారు. కాంట్రాక్టు కార్మికుల సర్వీసును రెగ్యులరైజ్‌ చేయాలనే మా ప్రభుత్వ నిర్ణయంపై జానారెడ్డి తెగ బాధపడ్తున్నారని కానీ, ఈ అంశాన్ని తాము ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టామన్నారు. అదే మేనిఫెస్టోపై ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారన్నారు. అందుకే దానిపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

అదే సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించటానికి త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామని, ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజ్‌ చేయాలా? వద్దా? కాంగ్రెస్‌ పార్టీ వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని జానారెడ్డి కోరుతున్నారని, అది ఒక సమస్యగా మారటానికి ఆయన ఇంతకుముందు మంత్రిగా ఉన్న ప్రభుత్వమే కారణమన్నారు.

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్నే కాకుండా... 70-80 కార్పొరేషన్లు, సంస్థలను ఉమ్మడిగా పెట్టి పోయారన్నారు. వాళ్లు చేసిన తప్పులను సరిచేసే పనిలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణ ఎదుర్కొంటున్న విద్యుత్‌ కష్టాలకు టీఎస్‌- కాంగ్రెస్‌ నేతల చేతగానితనమే కారణమని హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణలో పెట్టాల్సిన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను సీఎంగా వైయస్ రాజశేఖరరెడ్డి సీమాంధ్రకు తరలిస్తే, ఆ రోజు మంత్రిగా ఉండి ఎందుకు ప్రశ్నించలేదని జానారెడ్డిని నిలదీశారు.

విద్యుత్‌ కోతలకు కారణమైన వారే ఇప్పుడు విమర్శలు చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం విద్యుత్‌ సమస్య పరిష్కారానికి అన్ని అవకాశాలను పరిశీలిస్తోందని, అయితే ఇది రాత్రికి రాత్రి పరిష్కరించే సమస్య కాదన్నారు. తెలంగాణ కష్టాలకు మీరే కారణమని, తాము ప్రభుత్వంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదన్నారు. గడిచిన పదేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు.

వారి మేనిఫెస్టోలోని ఒక్క దానిని అమలు చేయలేదని, వాటిపై ఏ ఒక్క రోజూ సమీక్షించలేదని కాంగ్రెసు పార్టీ పైన ధ్వజమెత్తారు. అక్రమ కట్టడాలకు కారణమైన అక్రమార్కుల వైపు పొన్నాల నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతున్నారన్నారు. హైదరాబాద్‌లో అక్రమాలు, భూకబ్జాలు, గుండాగిరిని అరికట్టాలనే కృతనిశ్చయంతో కేసీఆర్‌ ఉన్నారని, వాటిపై కాంగ్రెస్‌ వైఖరి చెప్పాలన్నారు. కిషన్‌రెడ్డి తమ ప్రభుత్వాన్ని విమర్శించటానికి ముందు తెలంగాణ కోసం కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏం చేసిందో చెప్పాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+