తిరుమలలో మరో పండగ
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 59,584 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,905 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.18 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు నిండిపోయాయి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 నుంచి 22 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, పాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది. జనవరి 10 నుండి 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లపై టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు.
దీనితో పాటు- శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 30 నుండి జనవరి 23వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి సరిగ్గా 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో ఈ అధ్యయనోత్సవం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని దివ్యప్రబంధ అధ్యయనంగా పిలుస్తారు.
9వ శతాబ్దంలో శ్రీవారి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలు ఇవి. వీటిపై శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు. ఆళ్వార్ల దివ్యప్రబంధంలోని 4,000 పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు.
ఈ అధ్యయనోత్సవాల్లోని తొలి 11 రోజులను పగల్పత్తు, మిగిలిన 10 రోజులను రాపత్తుగా వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి శాత్తుమోర నిర్వహిస్తారు. 25వ రోజున అంటే 23వ తేదీన ఈ దివ్యప్రబంధ అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.
ఈ అధ్యయనోత్సవాల కోసం ఏర్పాట్లను పూర్తి చేస్తోన్నారు టీటీడీ అధికారులు. వైకుంఠ ఏకాదశితో పాటు అధ్యయనోత్సవ ఏర్పాట్లు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇందులో భాగంగా రంగనాయకులవారి మండపాన్ని ముస్తాబు చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications