సీరియస్గా తీసుకున్న టీటీడీ పాలకమండలి- నిజ నిర్ధారణ
TTD Goshala: ప్రపంచంలోనే అత్యంత పవిత్రక్షేత్రమైన తిరుమలలో వరుస అపచారాలు చోటుచేసుకుంటోండటం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తిరుమల లడ్డూపై దుష్ప్రచారంతో ఆరంభమైన ఈ ఉదంతాలు.. చివరికి శ్రీవారి ఆలయంలోకి చెప్పులతో ప్రవేశించేంత వరకు చేరాయంటూ మండిపడుతోంది.
తిరుపతి లడ్డూ కౌంటర్ల వద్ద తొక్కిసలాట, గోశాలలో గోవుల మృత్యువాత వంటి ఘటనలు సంభవిస్తోన్నాయని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపిస్తోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యలో కొనసాగుతున్న గోశాలలో మూడు నెలల్లోనే వందకు పైగా గోవులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాయంటూ టీటీడీ పాలకమండలి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించడం మరింత కలకలం రేపింది. ఇది రాజకీయ రంగు పులుముకుంటోంది.
కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తరువాత వరుసగా జరుగుతున్న ఈ గోమరణాలను టీటీడీ ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందంటూ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే. దేశంలో గోవును అత్యంత పవిత్రమైన జంతువుగా హిందువులు పూజిస్తుంటారని, సకల దేవతల స్వరూపిణీ అయిన గోమాతకు టీటీడీ గోశాలలో దారుణమైన పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు.
హైందవ ధర్మాన్ని కాపాడతామని, తిరులమ పవిత్రతను రక్షించడమే ధ్యేయంగా పాపప్రక్షాళన చేస్తామని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రభుత్వంలో టీటీడీ గోశాలలో గత మూడు నెలల్లో దాదాపు వందకు పైగా గోవులు మృత్యువాత పడ్డాయని అన్నారు. ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా దాచిపెట్టారని ధ్వజమెత్తారు.
టీటీడీ గోశాలలో గోమాత పట్ల జరుగుతున్న పాపానికి చంద్రబాబు, సనాతన ధర్మపరిరక్షణకు కంకణం కట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బదులు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. నిత్యం వైఎస్ జగన్పై విషం చిమ్మడంలోనే నిమగ్నం అయ్యారని, తిరుమల శ్రీవారిని కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ గత ప్రభుత్వంపై చెప్పలేనంత బుదరచల్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలు చేసిన అనంతరం టీటీడీ పాలకమండలి రంగంలోకి దిగింది. ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రగిరి శాసన సభ్యుడు పులివర్తి నాని.. తదితరులు టీటీడీ గోశాలను సందర్శించారు.
గోశాల అంతా కలియదిరిగారు. గోశాల స్థితిగతులు, నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. గోవులకు అందుతున్న గ్రాసాన్ని ఎక్కడి నుంచి తెస్తున్నారనే విషయంపై ఆరా తీశారు. గోవులన్నీ కూడా ఆరోగ్యంతో ఉన్నాయని నిర్ధారించుకున్నారు. అనంతరం గోశాలలో ఇన్ఛార్జ్ డైరెక్టర్ శ్రీనివాసులుతో సమావేశం అయ్యారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై అకారణంగా భూమన కరుణాకర్ రెడ్డి బురదజల్లే ప్రయత్నం చేస్తోన్నారని విమర్శించారు.
టీటీడీలో ప్రక్షాళన మొదలు పెట్టామని, తమ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీవారి భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం, లడ్డూలను అందజేస్తున్నామని బీఆర్ నాయుడు, పులివర్తి నాని అన్నారు. శ్రీవారిని నల్లరాయిగా అభివర్ణించిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అని, ఆయన మాటలకు ఏ మాత్రం విలువ లేదని ఆరోపించారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం టీటీడీని వాడుకోవద్దని అన్నారు.












Click it and Unblock the Notifications