తిరుమలలో వీఐపీ భక్తులకు షాక్ ఇచ్చిన సుబ్బారెడ్డి.. ఇక ఆ దర్శనాలు రద్దు..!!
ఇక నుండి తిరుమల శ్రీవారి దర్శనంలో అందరూ ఒకటే. ప్రముఖుల సిఫార్సు లేఖలతో ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాల పైన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కీలక ప్రకటన చేసారు. సిఫార్సు లేఖలతో ఇచ్చే ఎల్ దర్శనాలను నిలిపివేస్తామని స్పష్టం చేసారు. అదే విధంగా ప్రముఖులు ఏడాదికి ఒక్క సారే స్వామి వారి దర్శనం చేసుకోవాలని సూచించారు. ఇక, టీటీడీ బోర్దు పూర్తి స్థాయిలో ఏర్పడిన తరువాత దీని పైన తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే, సుబ్బారెడ్డి చెబుతున్నట్లుగా తిరుమల దర్శనం విషయంలో తీసుకొచ్చే మార్పులు అమలవటం సాధ్యమేనా..అందుకు తొలుత అసలు అధికార పార్టీ నేతలు సమహకరిస్తారా అనే చర్చ మొదలైంది.
శ్రీవారి బ్రేక్ దర్శనాలకు ఇక బ్రేక్..
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే వారికి ఇక బ్రేక్ దర్శనాలు ఉండవు. ప్రతీ రోజు తెల్లవారు జామున ప్రముఖుల సిఫార్సు లేఖలతో దాదాపు మూడు నుండి నాలుగు వేల మంది వరకు మూడు కేటగిరీల్లో బ్రేక్ దర్శనం ద్వారా త్వరిత గతిన శ్రీవారి దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. ఇక, నుండి తిరుమలలో బ్రేక్ దర్శనాలు ఇచ్చే L1, L2, L3 దర్శనాలను రద్దు చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

త్వరలో బోర్డు పూర్తి స్థాయిలో ఏర్పడిన తరువాత దీని పైన అధికారికంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అదే విధంగా..టీటీడీ బర్డ్ ఆస్పత్రిలో 40 గదుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆపరేషన్స్ త్వరిగతిన జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 8 ఆపరేషన్ థియేటర్లలో పరికరాలకు నిధులు కేటాయిస్తామని ఆయన చెప్పారు. మరో 10, 15 రోజుల్లో పూర్తిస్థాయిలో టీటీడీ బోర్డ్ నియామకం ఉంటుందని సుబ్బారెడ్డి వివరించారు.
వెంకయ్య చెప్పారు..సుబ్బారెడి పాటిస్తున్నారు..
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుమల వచ్చిన సమయంలో ఒక కీలక ప్రతిపాదన చేసారు. ప్రముఖులు.. వీఐపీ లు సంవత్సరంలో ఒక్క సారి మాత్రమే తిరుమల దర్శనానికి రావాలని..దీని ద్వారా సామాన్య భక్తులకు ఇబ్బంది లేని విధంగా చేసిన వారవుతారని సూచించారు. ఇప్పుడు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి అదే అమలు చేస్తున్నారు.
ప్రముఖులు సంవత్సరంలో ఒక సారి మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలని సూచించారు. న్యాయమూర్తులు..రాజకీయ నేతలు ప్రతీ సందర్భంలోనూ వచ్చి శ్రీవారిని దర్శించుకోవటం వారికి సెంటిమెంట్గా మారింది. వారిని టీటీడీ నియంత్రించగలదా అనే అంశం పైన చర్చ మొదలైంది. అదే విధంగా..దేవుడిని సంవత్సరంలో ఒక సారే దర్శించుకోవాలనే నిబంధన అమలవుతుందా..ముందుగా ఏపీలోని అదికార పార్టీ నేతలే దీనికి సహకరిస్తారా అనేది వేచి చూడాల్సిందే. నిజంగా ఇది అమలు జరిగితే మాత్రం సామాన్యులకు ఇక శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షణ తప్పే ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications