శ్రీవారిని దర్శించుకున్న వైవీ సుబ్బారెడ్డి: తప్పు పట్టిన నారా లోకేష్: దేవుడంటే నమ్మకం లేదంటూ ట్వీట్
తిరుపతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన ఓ ట్వీట్.. రాష్ట్రంలో రాజకీయంగా ప్రకంపనలను పుట్టిస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నాయకుల మధ్య ట్వీట్ల యుద్ధానికి తెర తీసింది. ఆ ట్వీట్పై సోషల్ మీడియా వేదికగా ఓ మినీ యుద్ధమే నడుస్తోంది. కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం కావడం వల్ల నారా లోకేష్ చేసిన ట్వీట్లపై వైఎస్ఆర్సీపీ తీవ్రంగా స్పందిస్తోంది.
Recommended Video
ఇంతకీ ఏమిటా ట్వీట్స్..?
ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీవారి ఆలయంలో భక్తుల ప్రవేశంపై నిషేధాన్ని విధించారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. 40రోజులుగా భక్తులు ఎవరూ స్వామివారిని దర్శించట్లేదు.
శ్రీవారికి యధాతథంగా నిత్య పూజలు, కైంకర్యాలు కొనసాగిస్తున్నారు. లాక్డౌన్ అమల్లోకి రాకముందు ఎలాంటి పూజలను నిర్వహించే వారో.. వాటిని కొనసాగిస్తున్నారు. భక్తులకు మాత్రం ప్రవేశాలను కల్పించలేదు. ఈ పరిస్థితుల్లో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీవారిని దర్శించుకోవడాన్ని నారా లోకేష్ తప్పు పట్టారు. దీనిపై ట్వీట్లు చేశారు.
వైఎస్ తోడల్లుడి కోసం నీ గుడి తలుపులు ఎలా తెరిచారయ్యా?
‘‘ఆపదమొక్కులవాడా! అనాథరక్షకా! నీకూ పేదా పెద్ద తేడాల్లేవంటారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో సామాన్యులకు నీ దర్శనభాగ్యమే లేదు. వైఎస్ తోడల్లుడు సకుటుంబ సమేతంగా వచ్చేసరికి నీ గుడి తలుపులు ఎలా తెరిచారయ్యా! దేవదేవుడు ఉత్సవాలతో అలరారిన తిరుమలగిరులు నిర్మానుష్యంగా మారినవేళ నిబంధనలు తుంగలోతొక్కి నీ సన్నిధిలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం అపరాధం కాదా! ఏడుకొండలే లేవన్నోళ్లు.. నువ్వున్నావంటే నమ్ముతారా? నీ కొండను నువ్వే కాపాడుకో స్వామీ!'' అంటూ నారా లోకేష్ కామెంట్స్ చేశారు.
రెండు ట్వీట్లను ఆయన పోస్ట్ చేశారు. వైవీ సుబ్బారెడ్డి, ఆయన తల్లి, భార్య, టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు స్వామి వారి దర్శనం చేసుకుని ఆలయం నుంచి వెలుపలికి వస్తోన్న ఓ వీడియో క్లిప్ను ఆయన తన ట్వీట్లకు జత చేశారు.
చట్టపరమైన చర్యలు తీసుకుంటా
నారా లోకేష్ చేసిన ఆరోపణలపై వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను టీటీడీ ఛైర్మన్ అనే విషయాన్ని నారా లోకేష్ మరిచిపోయినట్లున్నారని ఎద్దేవా చేశఆరు. ఛైర్మన్గా ఉన్న ప్రతి ఒక్కరు నెలలో రెండు శుక్రవారాలు స్వామివారి అభిషేక సేవలో పాల్గొనడం సంప్రదాయంగా వస్తోందని, దీన్ని ప్రశ్నించడానికి నారా లోకేష్కు ఉన్నఅర్హత ఏమిటని నిలదీశారు.
టీటీడీ వ్యవహారాలు, ఆలయాల పర్యవేక్షణ తన విధుల్లో భాగమని స్పష్టం చేశారు. ఆలయానికి తనతో పాటు తన భార్య, తల్లి మాత్రమే వచ్చారని పేర్కొన్నారు. టీటీడీ ఛైర్మన్, అధికారులు తమ విధులను తాము నిర్వర్తించడం నారా లోకేష్కు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఆలయంలో స్వామివారి సేవలు కొనసాగుతోన్న విషయం నారా లోకేష్ తెలియదేమోనని చురకలు అంటించారు.