SSD Token: భక్తులకు విజ్ఞప్తి, దర్శన టికెట్లు ఇక అర్ధరాత్రి ఇవ్వరు!
తిరుమల వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే కచ్చితంగా ఈ బిగ్ అప్ డేట్ మీకోసమే. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు కీలక సమాచారాన్ని అందించారు. తిరుపతిలో జారీ చేసే ఉచిత సర్వదర్శనం (SSD) టోకెన్ల జారీ వేళల్లో కీలక మార్పులు చేశారు. కొండపై భక్తుల రద్దీని బట్టి తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి రానుంది.
గత కొన్ని వారాలుగా వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భక్తులు ఎండకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అధికారులు అర్ధరాత్రి సమయం నుంచే టోకెన్ల జారీ ప్రక్రియను చేపట్టేవారు. అయితే, ప్రస్తుతం వేసవి సీజన్ ముగియడం, పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో తితిదే అధికారులు పాత విధానాన్ని సవరించారు. ఇకపై ప్రతిరోజూ మధ్యాహ్నం 1.30 గంటల నుంచే కౌంటర్లలో టోకెన్ల పంపిణీని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నూతన సమయాల మార్పు శుక్రవారం నుంచే క్షేత్రస్థాయిలో అందుబాటులోకి వచ్చింది.

ప్రధాన కేంద్రాల్లో టోకెన్ల కోటా వివరాలు..
తాజా మార్పుల ప్రకారం భక్తుల సౌకర్యార్థం తిరుపతి నగరంలోని మూడు ప్రధాన కేంద్రాల్లో అధికారులు టోకెన్లు కేటాయించారు. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్లలో కలిపి మొత్తం 12,000 సర్వదర్శనం టోకెన్లను అధికారులు భక్తులకు అందజేశారు. వీటితో పాటు, శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన కొండపైకి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా మరో 2,000 టోకెన్లను అదనంగా మంజూరు చేశారు.
కాబట్టి, తిరుపతి మీదుగా కాలినడకన లేదా నేరుగా కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలనుకునే సాధారణ భక్తులు ఈ మార్పులు గమనించి, అందుకు అనుగుణంగానే తమ తిరుమల యాత్రా ప్రణాళికను మార్చుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.














Click it and Unblock the Notifications