టిటిడి సంచలనం: 65 ఏళ్ళకే పూజారులకు రిటైర్మెంట్, ఆ నలుగురు ఔట్
బెంగుళూరు: టిటిడి పాలకమండలి బుధవారం నాడు కీలక నిర్ణయాలు తీసుకొంది. 65 ఏళ్ళు దాటిన అర్చకులను తొలగించాలని నిర్ణయం తీసుకొంది. కొత్త పాలకమండలి తొలి సమావేశం సంచలన నిర్ణయంతో టిటిడి ప్రధాన అర్చకులు రమణదీక్షితులతో పాటు మరో ముగ్గురు అర్చకులు పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
టిటిడి కొత్త పాలకవర్గం బుధవారం నాడుతిరుపతిలో టిటిడి ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన బుధవారం నాడు తిరుపతిలో జరిగింది. ఈ సమావేశంలో టిటిడి కీలక నిర్ణయం తీసుకొంది. 65 ఏళ్లు దాటిన అర్చకులను తొలగించాలని నిర్ణయించింది.కొత్త పాలకమండలి నిర్వహించిన తొలి సమావేశంలోనే ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తోందని టిటిడి ప్రకటించింది.
ఈ నిర్ణయంతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులతో పాటు నరసింహ దీక్షితులు, శ్రీనివాసమూర్తి దీక్షితులు, నారాయణ దీక్షితులు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.
మరోవైపు టీటీడీ బ్యాంకు డిపాజిట్లు, ఎఫ్ఎంఎస్ పనితీరుపై సబ్ కమిటీలు వేయాలని పాలకమండలి నిర్ణయించింది. పునర్వసు నక్షత్రం రోజున శ్రీనివాసమంగాపురం, చంద్రగిరి కోదండరామస్వామి ఆలయాల్లో ఆర్జిత కల్యాణం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
మరోవైపు, రమణ దీక్షితులు ఇటీవల చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి ఆలయంలోని ఆచార వ్యవహారాలపై పలు విమర్శలు గుప్పించారు. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై వివరణ కోరతామని టిటిడి ఈవో సింఘాల్ వివరణ కోరనున్నట్టు చెప్పారు.