తిరుమలలో మరిన్ని వసతి గదులు?- ఫేస్ బుక్ అకౌంట్ పై క్లారిటీ
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 63,897 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 29,500 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.66 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తిరుమలలోని పాత భవనాలను టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి సందర్శించారు. వివిధ ప్రాంతాల్లో భవనాలన్నింటినీ పరిశీలించారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దాలని ఆదేశించారు. వాటిని ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు.
ఇప్పుడు అందుబాటులో ఉన్న వసతి గదులకు అదనంగా పాత భవనాలను వినియోగంలోకి తీసుకుని రావాల్సిన అవసరం ఉందని శ్యామలరావు చెప్పారు. దీనివల్ల తిరుమలకు వచ్చే మరింత మంది భక్తులకు వసతి సదుపాయాన్ని కల్పించినట్టవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తిరుమలలో నిరుపయోగంగా ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ భవనాన్ని కూడా శ్యామలరావు, వెంకయ్య చౌదరి సందర్శించారు. ఈ సందర్భంగా భవన పరిస్థితిపై వాళ్లు ఆరా తీశారు. ఈ భవనానికి మరమ్మతులు చేయడం లేదా అదే ప్రాంతంలో కొత్త భవనాన్ని నిర్మించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.
అంతకుముందు హిల్ వ్యూ డీలక్స్ కాంప్లెక్స్, బాలాజీ నిలయం, తిరుమల మందిరం (ఆంప్రో రెస్ట్ హౌస్) వంటి ఇతర విశ్రాంతి భవనాలను ఆయన పరిశీలించారు. అక్కడి పరిస్థితిని బట్టి మరమ్మతులు, పునర్నిర్మాణంపై కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను సూచించారు.
శ్యామలరావు పేరుతో ఫేస్బుక్లో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఖాతాను సృష్టించి, భక్తులకు సందేశాలు పంపుతూ డబ్బులు కావాలని కోరుతున్నారని టీటీడీ దృష్టికి వచ్చింది. ఇది పూర్తిగా మోసగాళ్ల నకిలీ చర్యగా గుర్తించింది టీటీడీ. భక్తులు నకిలీ అకౌంట్లకు దూరంగా ఉండాలని శ్యామలరావు చెప్పారు.
ఎవరికైనా ఇలాంటి సందేహాస్పద సందేశాలు వస్తే వెంటనే విజిలెన్స్ విభాగ సెల్ నంబర్ 9866898630 లేదా టీటీడీ టోల్ ఫ్రీ 18004254141 కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు తమ అధికారిక వెబ్సైట్ www.tirumala.org లేదా సోషల్ మీడియా అధికారిక ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరింది.












Click it and Unblock the Notifications