TTD: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడితో విభేదాలు ? ఈవో క్లారిటీ ఇదే..!
తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ)ని ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం ఓవైపు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో మరోవైపు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట టీటీడీని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేసింది. అయితే ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు టీటీడీ ఎక్కడా చెప్పకపోవడం, ఛైర్మన్, ఈవో మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరగడం చర్చనీయాంశమైంది.
తిరుపతి తొక్కిసలాట తర్వాత అక్కడ పర్యటించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఛైర్మన్, ఈవో సమన్వయంతో పనిచేయాలని తేల్చిచెప్పేశారు. రివ్యూ మీటింగ్ లో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఈ ఘటనపై పరస్పరం ఆరోపణలు చేసుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడితో శ్యామలరావుకు గ్యాప్ ఉందన్న చర్చ సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఇవాళ టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. టీటీడీలో ఎలాంటి సమన్వయ లోపం లేదని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. అలాగే టీటీడీలో ఛైర్మనే కీలకమని, బోర్డు నిర్ణయాల్ని అదికారులు అమలు చేస్తారని కూడా వెల్లడించారు. మరోవైపు తిరుపతి వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం భక్తుల్ని అనుమతించే విషయంలో కొన్ని లోపాలు జరిగాయని శ్యామలరావు అంగీకరించారు. అయితే ఛైర్మన్ కూ, తనకూ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తాను ఎవరితోనూ అమర్యాదగా మాట్లాడనని ఈవో స్పష్టం చేశారు. తొక్కిసలాట వంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications