TTD: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక!
కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండల పైన కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం భక్తులు వేల సంఖ్యలో తిరుమలకు వెళుతుంటారు. తిరుమలకు వచ్చే స్వామి భక్తులు స్వామి వారి సేవల విషయంలో పూజల విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఎప్పటికప్పుడు కీలక అప్డేట్లను ఇస్తుంది.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై కీలక అలెర్ట్
ఇక తాజాగా సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్న నేపథ్యంలో టిటిడి సన్నాహాలను ప్రారంభించింది. తిరుమలను ముస్తాబు చేసేందుకు సమయంలో ఏర్పాట్లు పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి మరొక కీలక అప్డేట్ ఇచ్చింది.

జూలై 20 నుండి ఆగస్టు 19 వరకు స్వామి పుష్కరిణిలో మరమ్మత్తు పనులు
తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలోని పవిత్ర స్వామి పుష్కరిణిలో మరమ్మతు పనులు జూలై 20 నుండి ఆగస్టు 19, 2025 వరకు జరగనున్నాయి అని టీటీడీ పేర్కొంది. శ్రీవారి సాకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ పుష్కరిణి మరమ్మతు పనులు చేపడుతున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబరు 24 నుండి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో, టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో నెల రోజుల ముందుగానే ఈ పనులను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్టు టీటీడీ తెలిపింది.
పుష్కరిణి విషయంలో కీలక అలెర్ట్
ఈ సమయంలో, నెల రోజుల పాటు పుష్కరిణి హారతి నిర్వహించరని భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని పేర్కొంది. అలాగే భక్తులను పుష్కరిణిలోకి అనుమతించరని వెల్లడించింది. ఈ విషయాన్ని గమనించి, భక్తులు టీటీడీకి సహకరించాలని కోరుతోంది. పుష్కరిణి పవిత్రతను కాపాడేందుకు, మరమ్మతు పనులు సకాలంలో పూర్తి చేయడం ద్వారా పుష్కరిణిని మళ్లీ భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు టిటిడి ప్రయత్నిస్తోంది.
భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
బ్రహ్మోత్సవాలకు సన్నద్ధమవుతున్న క్రమంలో టీటీడీ తిరుమల స్వామి వారి ఆలయానికి, పుష్కరిణికి సంబంధించి పనులను కొనసాగిస్తుంది. భక్తులు ఈ నిర్ణయాన్ని గౌరవించి, ఆలయ సంప్రదాయాలను కాపాడేందుకు తమ వంతు సహాయం అందించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తేదీలను టిటిడి వెల్లడించింది.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారని సెప్టెంబర్ 23వ తేదీన శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని సెప్టెంబర్ 24న ధ్వజారోహణం సెప్టెంబరు 28న గరుడ వాహనం, అక్టోబర్ ఒకటవ తేదీన రథోత్సవం, అక్టోబర్ రెండవ తేదీన చక్రస్నానం నిర్వహిస్తారని ముఖ్యమైన తేదీల వివరాలను పేర్కొంది.












Click it and Unblock the Notifications