టీటీడీ స్టయిలే డిఫరెంట్: ఆగమశాస్త్రానికి భిన్నంగా లడ్డూ పోటు కోసం ఉగ్రాణం కూల్చివేత?
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారుల లీలలే వేరుగా ఉంటాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లు ఉంది టీడీపీ వ్యవహారం. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమలలోని లడ్డూ పోటును విస్తరించాలి. అంతవరకు బాగానే ఉన్నది. కానీ ఈ క్రమంలో ఆలయం లోపల ఉన్న పురాతన ఉగ్రాణం గోడను అధికారులు ఆగమశాస్త్రానికి విరుద్ధంగా తొలగించారని టీటీడీలో చర్చ వినిపిస్తోంది.
పోటు ఆధునీకరణలో భాగంగా మూడు బండలు (దీనిపైనే బూందీ, పాకం కలుపుతారు) పట్టేలా సుమారు 10 మీటర్ల వెడల్పుతో ఉన్న గోడను ఇటీవల తొలగించినట్లు సమాచారం. ప్రస్తుతం లడ్డూ పోటులో రోజుకు 3.10లక్షల లడ్డూలు తయారు అవుతున్నాయి. దీన్ని ఈ నెల 20కల్లా 5 లక్షలకు పెంచాలని ఇటీవలే టీటీడీ లక్ష్యంగా పెట్టుకుంది.

కోనేరు సమీపాన బూందీ తయారీ ఇలా
ఆలయం లోపల ఉన్న ఉగ్రాణానికి చారిత్రక ప్రాశస్త్యం ఉంది. స్వామి వారి కల్యాణం జరిగే వేదిక వెనుకవైపు ఉండే ఉగ్రాణాన్ని గతంలోనే నాలుగు విభాగాలుగా చేశారు. ఒక విభాగంలో కార్యాలయంతో పాటు, మూడు గదుల్లో లడ్డూ తయారీకి అవసరమయ్యే సరకులను నిల్వ చేస్తున్నారు. అదనపు పోటుకు ఆనుకొని ఉన్న ఉగ్రాణం గోడను తొలగించి అక్కడ సైతం లడ్డూలను చుట్టే బండలను పెట్టాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కార్యాలయంగా ఉపయోగిస్తున్న స్థలాన్ని పోటులోకి కలిపేసి ఆ స్థలాన్ని విస్తరించాలని భావించిన అధికారులు గోడను తొలగించినట్లు సమాచారం. ప్రస్తుతం లడ్డూ తయారీకి వాడే బూందీని ఆలయం బయట కోనేరు సమీపంలో తయారుచేసి పోటులోకి తీసుకెళ్తున్నారు.

అమలు
వర్గాలుగా విడిపోయి టీటీడీ అర్చకుల అంతర్గత వాదనలు
గోడ తొలగింపుపై ఆలయ ఆగమశాస్త్ర పండితుల్ని సంప్రదించలేదన్న వాదన విన్పిస్తోంది. దీనిపై ఆలయంలో అర్చకులు వర్గాలుగా విడిపోయి అంతర్గతంగా వాదించుకుంటున్నారని తెలుస్తోంది. పురాతత్వ వేత్తలు కూడా.. ఆధునీకరణ పేరుతో ఆలయ కట్టడాలు ఇష్టానుసారం కూల్చేయడం తగదని చెబుతున్నారు. పోటు విస్తరణ, ఉగ్రాణం గోడ తొలగింపుపై టీటీడీ అధికారులెవరూ స్పందించడానికి ఇష్టపడటం లేదు.

అడయార్ యంత్రం గుండ్రం.. అవసరాలకు సరిపోదన్న అభిప్రాయం
పోటులో బూందీ తయారీ ఉపయోగించే యంత్రాన్ని టీటీడీ అధికారులు ఇటీవల చెన్నై అడయార్ స్వీట్స్లో పరిశీలించి వచ్చారు. అడయార్ కంపెనీలో యంత్రం ద్వారా సిద్ధమవుతున్న బూందీ గుండ్రంగా ఉండటంతో అది సరిపోదన్నది ఉద్యోగుల అభిప్రాయంగా ఉంది. దీంతో ఈ ప్రతిపాదనను పక్కనపెట్టి మరోసారి అధికారులంతా ముంబైకి పయనమవుతున్నట్లు తెలుస్తోంది. పోటు విస్తరణలో మరో 50 మందిని నియమించుకోవడానికి అధికారులు అనుమతి తీసుకున్నారు.

సామాన్య భక్తులకిచ్చే ధరలు యథాతథం
సామాన్య భక్తులకు అందించే లడ్డు ధరలపై ఎలాంటి పెంపు ఉండదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. సిఫార్సు లేఖలపై ఇచ్చే లడ్డు ధరలు పెంచేందుకు టీటీడి సిద్ధమౌతున్నది. ఈ మేరకు ఒక్కో లడ్డు ధర రూ. 50, కళ్యాణోత్సవం లడ్డు ధర రూ. 200, వడ ధర రూ.100. దర్శనంపై పొందే లడ్డు ధరలు యథాతథం అని టీటీడీ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. పెరిగిన ధరలు ఈ నెల 25వ తేదీ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

కౌంటర్ల నిర్మాణంపై టీటీడీ ఈవో అసంతృప్తి
సర్వదర్శనం టోకెన్ల జారీకి ఏర్పాటు చేసిన కేంద్రాల నిర్మాణం తీరుపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. టోకెన్ల జారీకి అనువుగా నిర్మాణం చేపట్టాల్సి ఉన్నా లోపభూయిష్టంగా పనులు జరిగాయని వ్యాఖ్యానించారు. ప్రయోగాత్మక పరిశీలన సందర్భంగా అధికారులకు ఈవో పలు ప్రశ్నలు వేశారు. సర్వదర్శనం కౌంటర్లలో విధులు కేటాయించిన సిబ్బందికి తిరుమల అన్నమయ్య భవనంలో అవగాహన తరగతులు నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు, మధ్యాహ్నం 11, మధ్యాహ్నం మూడు గంటలకు బృందాల వారీగా టోకెన్ల జారీపై శిక్షణ ఇచ్చారు.

రోజూ 75 వేల మందికి శ్రీవారి దర్శనం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి సర్వ దర్శనం భక్తులకు తిరుపతిలోనూ టోకెన్ల జారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ పునరుద్ఘాటించారు. తిరుమలలో జేఈవో శ్రీనివాసరాజుతో కలిసి సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను శనివారం పరిశీలించారు. ఈవో మాట్లాడుతూ సాధారణ రోజుల్లో నిత్యం 65 వేల నుంచి 75 వేల మంది భక్తులు తిరుమలకు వస్తున్నారని, వీరికి స్వామివారి దర్శన నిరీక్షణ సమయం 10 గంటల వరకు ఉంటుందని వివరించారు. రద్దీ భారీగా పెరిగే పక్షంలో 20 నుంచి 24 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోందన్నారు.

ప్రయోగాత్మకంగా నిర్ణీత సమయంలో సర్వదర్శనానికి ఏర్పాట్లు
రద్దీ సమయాల్లో కంపార్ట్మెంట్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించాలని ఎక్కువ మంది భక్తుల అభిప్రాయ సేకరణలో తెలిపినట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. ఈ నేపథ్యంలో నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. సర్వదర్శనం కౌంటర్ల ఏర్పాటుకు జేఈవో శ్రీనివాసరాజు నేతృత్వంలో అధికారులు 15 రోజులుగా నిరంతరాయంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

శ్రీవారి సేవకుడిగా పని చేస్తానన్న సాయిబాబారెడ్డి
భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తామని టీటీడీ డిప్యూటీ క్యాటరింగ్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సాయిబాబారెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా రికార్డులను ఆయన పరిశీలించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఉద్యోగుల అన్నదాన క్యాంటీన్, శ్రీనివాసంలోని అన్నదానం, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి అన్నదానం, శ్రీపద్మావతి అతిథిగృహంలోని అన్నదాన క్యాంటీన్లు సాయిబాబారెడ్డి పరిధిలో ఉంటాయి. తిరుమల అన్నదానం నుంచి ఆయన ఇటీవల తిరుపతికి బదిలీ అయ్యారు. తిరుపతికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలతో రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించి స్వామివారి సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు.












Click it and Unblock the Notifications