TTD: తిరుమలలో శ్రీవారి సేవా ఆన్లైన్ కోటా నేడు విడుదల, సర్వదర్శనానికి సమయమిలా!!
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండలపై కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకులుగా భక్తులు పాల్గొనే, అద్భుతమైన అవకాశం కోసం చాలామంది భక్తులు వేచి ఉంటారు. అలాంటి వారికోసం ఆగస్టు నెలలో స్వామివారి సేవకు సంబంధించి శ్రీవారి సేవ ఆగస్టు కోటా టికెట్లను నేడు విడుదల చేస్తోంది టీటీడీ.
స్వామివారి సేవా టికెట్ల విడుదల నేడే
సామాన్య భక్తులు కూడా స్వామివారికి సేవలు అందించేందుకు నేడు ఆన్లైన్లో సేవా టికెట్లను టిటిడి అందుబాటులోకి తెస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానాలలో శ్రీవారి సేవ కోట ఉదయం 11 గంటలకు నేడు అందుబాటులోకి వస్తుంది. స్వామివారి నవనీత సేవకు సంబంధించి మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవకు సంబంధించి మధ్యాహ్నం ఒంటిగంటకు ఆన్లైన్లో టికెట్ లను విడుదల చేయనున్నారు.

శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులు చెయ్యాల్సిందిదే
శ్రీవారి సేవలో పాల్గొనాలి అనుకునే భక్తులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ భక్తులను కోరుతోంది. శ్రీవారి సేవలో పాల్గొనాలి అనుకునే భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చని టిటిడి వెల్లడించింది. అయితే శ్రీవారికి సేవను అందించాలనే భక్తులు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని టిటిడి సూచిస్తుంది.
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సమయం ఇదే
స్వామి సేవలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా మెడికల్ సర్టిఫికెట్ ను అందజేయాలని పేర్కొంది. వారంతా స్వచ్ఛందంగా తమ సేవలను అందజేస్తారని, వీరందరికీ ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ కూడా కేటాయించడం జరుగుతుందని టిటిడి పేర్కొంది. ఇదిలా ఉంటే తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతుంది.
తిరుమలలో నిన్న భక్తుల రద్దీ ఇలా
31 కంపార్ట్మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న 89 వేల 161 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 36వేల 450 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.77కోట్లుగా ఉంది. టైం స్లాట్ ఎస్ఎస్ డి దర్శనం కోసం 12కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా, దర్శనానికి 6గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది.












Click it and Unblock the Notifications