TTD: లడ్డూలు, బ్రేక్, వసతి టికెట్లు మరింత సులభంగా - తిరుమలలో కొత్తగా 20 చోట్ల..!!
Tirumala: తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. బ్రేక్ దర్శనాల మార్పు తరువాత సాధారణ భక్తుల దర్శన సంఖ్య పెరిగినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. సాంకేతికత వినియోగించి క్యూ లైన్ల నిర్వహణ.. దర్శనాల సంఖ్య మరింత సులభతరం చేసేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో తిరుమల కు వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదంతో పాటుగా.. విరాళాలు, అదే విధంగా బ్రేక్ దర్శన టికెట్ల కు వినియోగించేలా కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చారు
టీటీడీ నిర్ణయంతో
తిరుమలలో సాంకేతికత ద్వారా భక్తులకు సేవలను సులభతరం చేసేందుకు టీటీడీ వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. టీటీడీలో కియోస్క్ (సెల్ఫ్ ఆపరేటెడ్ మిషన్) యంత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో 20 కియోస్క్ల ఏర్పాటు చేసారు. కియోస్క్ల సాయం తో భక్తులకు టీటీడీ సేవలు సులభంగా అందుతున్నాయి. పైగా బోలెడంత సమయం ఆదా అవుతోంది. దీంతో ఈ కియోస్క్లను విరివిగా వినియోగించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు హుండీ ద్వారా కాకుండా విరాళాలు ఇవ్వాలంటే పెద్ద తతంగమే ఉండేది. రూ.లక్షకుపైగా విరాళాలు ఇవ్వాలంటే దాతల విభాగానికి చేరుకుని, అక్కడ అన్ని వివరాలూ తెలియజేసిన తర్వాతే విరాళాలు తీసుకునేవారు.

ఇప్పటికే ప్రారంభం
రూ.లక్షలోపు విరాళాలకు వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఓ కౌంటర్ను ఏర్పాటు చేసినప్ప టికీ అక్కడ వివరాలు నమోదు చేయడం, కార్డు లేదా నగదుతో విరాళాలు చెల్లించడం వంటి ప్రక్రియతో భక్తులు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో రూ.లక్షలోపు విరాళాలిచ్చే భక్తులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో తొలిసారిగా వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఈ కియోస్క్ మిషన్ను ఏర్పాటు చేశారు. భక్తులు దీనిలోని క్యూఆర్ కోడ్ను తమ సెల్ఫోన్తో స్కాన్ చేసి యూపీఐ ద్వారా రూ.లక్షలోపు ఎంతైనా విరాళంగా అందించవచ్చు. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో టీటీడీ ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో 20 కియోస్క్ లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఇప్పటివరకు రూ.4 కోట్ల విరాళాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మరికొన్ని సేవల్లోకి కియోస్క్ లను ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే లడ్డూలు పొందే భక్తులకూ కియోస్క్ లు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
లడ్డూ - టికెట్ల ప్రింట్
ఈ మిషన్ల ద్వారాలడ్డూ ఆప్షన్లోకి వెళ్లి కావాల్సిన లడ్డూ సంఖ్యను టైప్ చేసి యూపీఐ ద్వారా నగదు చెల్లిస్తే ఓ రసీదు వస్తుంది. ఆ రసీదును లడ్డూ కౌంటర్లో చూపించి లడ్డూలు పొందవచ్చు. తద్వారా భక్తుల నిరీక్షణ సమయం తగ్గుతుందని టీటీడీ భావిస్తోంది. ఈ కియోస్క్ లో వీఐపీ బ్రేక్ టికెట్లను కూడా సులభతరంగా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఉండే ఈ కియోస్క్ మిషన్లో బ్రేక్ దర్శన టికెట్ ఆప్షన్లోకి వెళ్లి ఎన్రోల్మెంట్ నంబరును ఎంట ర్ చేసి పేమెంట్ చేస్తే టికెట్ ప్రింట్ ఇస్తుంది. దీంతో భక్తులు వారు బస చేసే అతిథి గృహాలు, కాటేజీల్లోనే సులభంగా టికెట్లు పొందవచ్చు. ఇలా పలు విభాగాల్లోకి కియోస్క్ ను ప్రవేశపెట్టి భక్తులకు సులభతరంగా సేవలు అందించాలని టీటీడీ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇవి అందు బాటులోకి రావటం ద్వారా భక్తులకు సేవలు మరింత సులభతరం కానున్నాయి.












Click it and Unblock the Notifications