తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు..!
విజయవాడ: రోజుకీ సగటున 65వేల మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనాల్లో తిరుమలకు చేరుకుంటుండటంతో తిరుమల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్య ఎక్కవై ప్రమాదాలకు దారి తీస్తుంది.
ఇక బారీ వర్షాలు కురిసినప్పుడు కొండ చరియలు విరిగి పడటం వల్ల తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పుడుతుంది. దీంతో తిరుమల ఘాట్ రోడ్డు పక్కనే రైలు మార్గాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు ప్రాజెక్టును చేపట్టడానికి సమగ్ర నివేదికను రూపొందించడానికి పూర్తి స్దాయి సర్వే చేశారు. తొలి దశలో ఆరు మోనో రైలు ఇంజన్లు, వంద బోగీలను కొనుగోలు చేయడానికి రూ. 3,510 కోట్లు అవసరం అవుతాయని తేల్చారు.
ప్రస్తుతం ఉన్న తిరుపతి ఆర్టీసీ బస్ స్టేషన్ను మోనో రైలు స్టేషన్గా మార్చాలని ఈ నివేదికలో ప్రతిపాదించారు. కపిల తీర్దం వద్ద ఓ రైల్వే స్టేషన్, అలిపిరి వద్ద మరో రైల్వే స్టేషన్ నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు.
మోనో రైలు ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు తుడా (తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) అధికారులు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే టీటీడీ యాజమాన్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్దిక సహాయం చేయాలని నివేదిక పంపినట్లు ప్రణాళికా విభాగం అధికారి కృష్ణారెడ్డి తెలిపారు.
ఈనెల 15న తిరుపతి ఎంపీ వరప్రసాదరావు తుడా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ప్రాజెక్టు నివేదికను తనతో పాటు కేంద్రానికి, టీటీడీ బోర్డుకు పంపాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధుల్లో 80 శాతం కేంద్రం భరించనుండగా, మిగిలిన నిధులను తుడా సమకూర్చనుంది.