రాజ్యసభ రేసులో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇతర ఛానల్స్ అధినేతలు...
జనంలో పార్టీ పట్ల స్థిరభిప్రాయం ఉంచేందుకు ఈరోజుల్లో మీడియా పాత్ర చాలా కీలకంగా మారిపోయింది. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ఆయా పార్టీల మైలేజ్ పెంచడానికి, కష్ట కాలంలో ప్రజల్లో పార్టీకి మచ్చ రాకుండా ఉండడానికి మీడియా కృషి చాలానే ఉంటుంది. ఈ విషయంలో ఏపీ అధికార పార్టీ టీడీపీకి మీడియా మద్దతు పుష్కలంగా ఉన్న విషయం తెలిసిందే.
మరి పార్టీల కోసం ఇంత చేసే ఛానెళ్లు.. ఆయా పార్టీల నుంచి ఏం ఆశించవా.. అనే సందేహం తలెత్తొచ్చు. దీనికి సమాధానం దొరికే సమయం ఆసన్నమైనట్టుగానే కనిపిస్తుంది. తాజాగా ఖాళీ అవబోతున్న రాజ్యసభ సీట్లలో టీడీపీకి మూడు సీట్లు దక్కే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయా మీడియా ఛానెళ్ల అధిపతులు టీడీపీ తరుపున రాజ్యసభ రేసు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం.
ఇందులో ప్రముఖ వార్తా చానెళ్ల అధిపతులు.. ఆంధ్రజ్యోతి-రాధాక్రిష్ణ, ఎన్టీవి-నరేంద్ర చౌదరి, టీవి5-నాయుడు రాజ్యసభ సీటు ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో చిత్తూరు జిల్లాకు చెందిన నాయుడు ఇప్పటికే ఓ కేంద్రమంత్రి ద్వారా చంద్రబాబుకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
అయితే పార్టీకి చెందిన ఎక్కువమంది నేతలు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణకే అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారట. చంద్రబాబుకు, రాధాక్రిష్ణకు ఉన్న అనుబంధం అలాంటిది మరి. అయితే సీటు కోసం ప్రయత్నిస్తున్న ఈ మీడియా చానెల్ అధిపతులంతా ఒకే కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. తుది నిర్ణయం పార్టీ అధినేత చంద్రబాబుదే కాబట్టి మరి అధినేత ఎవరిని కరుణిస్తారో వేచి చూడాలి.