బిటెక్ విద్యార్థి, డ్యాన్సర్ అరెస్టు: దావుద్ ముఠాతో లింక్?
హైదరాబాద్: కార్లను, ఎర్రచందనాన్ని దొంగతనం చేసి, అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారనే ఆరోపణపై పోలీసులు హైదరాబాదులోని బహదూర్పురాలో ఓ బిటెక్ విద్యార్థి, ఓ డ్యాన్సర్ను అరెస్టు చేశారు. వారికి దావూద్ ముఠాతో సంబంధాలు ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - నిందితుడు సి. తేజ మోహన్ రాజు తన రూమ్మేట్స్ టి వినాయక, ప్రసాద్లతో కలిసి ఎర్రచందనాన్ని కర్ణాటకకు అక్రమంగా తరలిస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు నరేష్, నయీమ్, జకీర్ల నుంచి వారు ఆ ఎర్రచందనాన్ని తీసుకునేవారని డిప్యూటీ పోలీసు కమిషనర్ (డిటెక్టివ్ శాఖ) జి. పాలరాజు మీడియాతో చెప్పారు.
కడపకు చెందిన తేజ హైదరాబాదులో బిటెక్ చేస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు. ట్రావెలింగ్ ఏజెన్సీల నుంచి కార్లను అద్దెకు తీసుకుని జల్సాగా తిరగడం అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత కార్ల అద్దెలకు చెల్లించలేక అప్పులు పెట్టాడు. ఈ స్థితిలో తన రూమ్మెట్స్తో కలిసి కార్లను దొంగిలించడానికి పూనుకున్నాడు.

ఇదే సమయంలో అతనికి ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు పరిచయమయ్యారు. దాంతో వినాయక, ప్రసాద్లతో కలిసి దొంగిలించిన కార్లలో ఎర్రచందనం రవాణా చేయడం అలవాటు చేసుకున్నాడు. వీరు తీసుకెళ్లిన ఎర్రచందనాన్ని కోలారులో జకీర్, నయీమ్ ఛోటా బాయ్కి అమ్మేవారు.
తమకు అందిన సమాచారంతో పోలీసులు బిటెక్ విద్యార్థి తేజను, డ్యాన్సర్ వినాయకను అరెస్టు చేశారు. వారి నుంచి మూడు కార్లను, 60 లక్షల రూపాయల విలువ చేసే 60 కిలోల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని తాము ఆంధ్రప్రదేశ్ పోలీసులకు తెలియజేశామని, మరో నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పాలరాజు చెప్పారు.
ఛోటా భాయ్ ఆ ఎర్రచందనాన్ని మంగళూర్ ఓడ రేవు ద్వారా దుబాయ్కు అక్రమంగా తరలిస్తాడని చెప్పారు.












Click it and Unblock the Notifications