విషాదం: కుక్కకు భయపడి మూడో అంతస్తు నుంచి దూకి ఇద్దరు మృతి
విశాఖ: ఏపీలోని విశాఖపట్నం అక్కయ్యపాలెంలో దారుణం జరిగింది. పనుల నిమిత్తం ఓ భవనం పైకి వెళ్లిన ముగ్గురు కూలీలు.. అక్కడే మూడో అంతస్తులో ఉన్న కుక్క వెంట పడగా, వారు భయపడి మూడో అంతస్తు నుంచి కిందకు దూకారు. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.
ఆ భవనం ఓ ప్రముఖుడిదిగా తెలుస్తోంది. ఆ భవనంలోని మూడో అంతస్తులో పెయింటింగ్ పనులు చేసేందుకు ఈ రోజు ఉదయం ముగ్గురు కూలీలు ఇంటికి వచ్చారు. వారు ముగ్గురు కూడా మూడో అంతస్తులో పని చేస్తుండగా అక్కడకు అప్పుడే పెంపుడు కుక్క ఉంది.
వారిని చూసి అది అరిచింది. వారు భయపడి అక్కడి నుంచి పరుగెత్తుకు వచ్చి మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. ఈ ఘటనలో గోపి అనే కూలి అక్కడికి అక్కే మృతి చెందాడు. హుస్సేన్ అలీ అనే మరో కూలి తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీను అనే వ్యక్తి కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కూలీలు డాబా పైన పని చేసుకుంటుండగా, పెంపుడు కుక్కను విడిచి పెట్టారని, అది పని చేస్తున్న కూలీల వద్దకు వెళ్లిందని, అప్పుడు భయపడి వారు కిందకు దూకారని చెబుతున్నారు. కుక్క యజమాని మాట్లాడుతూ.. కుక్క గొలుసు తెంపుకొని పైకి పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.