కర్నూల్లో రాజకీయ ఆధిపత్యం: భాషా హత్యకు ప్రతీకారం, కాంగ్రెస్ కార్యకర్త నరికివేత
కర్నూలు: జిల్లాలోని ప్యామిలి మండలం మునిమడుగు గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయ హత్యలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో, మునిమడుగు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాగూర్ భాషాను ప్రత్యర్థులు హత్య చేశారు. ప్రతీకార చర్యగా ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంబగిరి స్వామిని నరికేశారు. పోలీసుల భద్రతా వలయాన్ని చేధించుకొని వెళ్లి భాషా హత్యకు ప్రతీకారం తీసుకున్నారని తెలుస్తోంది.
గంటల వ్యవధిలోనే ఇద్దరి హత్య గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగిందని చెబుతున్నారు.
గ్రామంలో గంటల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులు ఫ్యాక్షన్ రాజకీయాలకు బలయ్యారు. ఇది గ్రామంలో అందరిని భయకంపితులకు గురి చేస్తోంది. ఉదయం టిడిపి నేత హత్య, ఆ తర్వాత కాంగ్రెస్ నేత ప్రతీకార హత్యతో గ్రామం ఉడికిపోతోంది. కత్తులు, రాళ్లు, రాడ్లతో పరస్పరం దాడికి దిగారు. రాజకీయ ఆధిపత్య పోరులో ఇద్దరు బలయ్యారు. ఇరువర్గాల పరస్పర దాడిలో పలువురు గాయపడ్డారు.
కాకినాడలో నలుగురు ఉపాధ్యాయులపై హెల్మెట్తో దాడి
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని సిబిసిఎన్సీ పాఠశాల వద్ద ఘర్షణ జరిగింది. నలుగురు ఉపాధ్యాయుల పైన ఓ మహిళా టీచర్ భర్త, కుమారుడు హెల్మెట్తో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. స్కూలుకు ఆలస్యంగా వస్తున్నారని నిలదీశారనే ఈ దాడి చేశారని తెలుస్తోంది.