ప్రేమలో ఇద్దరమ్మాయిలు: పెళ్లి చేసుకుంటామంటూ తిరుపతికి!
అనంతపురం: ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. ఒకరినొకరు వదిలి ఉండలేక, పెద్దలను ఎదురించలేక ఎటో వెళ్లిపోయారు.
అయితే, వారిద్దరూ అమ్మాయి అబ్బాయి కాదు.. ఇద్దరూ అమ్మాయిలే కావడం గమనార్హం. ఈ ఘటన అనంతపురం జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.
ప్రేమలో పడిపోయారు
అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు అనంతపురం రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. ఇందులో ఒకరు సీనియర్ కాగా, మరొకరు జూనియర్. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. ప్రేమగా మారింది.
పెళ్లి చేసుకుంటామంటూ..
ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాము ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకునేందుకు తిరుపతికి వెళ్తున్నామని ఓ లేఖను రాసి వెళ్లిపోయారు. అంతేగాక, తమ కోసం వెతకొద్దని పేర్కొన్నారు.
తల్లిదండ్రుల ఆందోలన
ఈ విషయం కళాశాల యాజమాన్యానికి తెలియడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆందోళనకు గురైన యువతుల తల్లిదండ్రులు అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
చివరకు పట్టేశారు..
ఆ యువతుల వద్ద సెల్ఫోన్ ఆధారంగా వారు తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ఆదివారం తిరుపతికి చేరుకుని ఇద్దరమ్మాయిలను గుర్తించారు. ప్రస్తుతం వారిని వారి వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు అనంతపురం తీసుకొచ్చారు.