తొందరొద్దని సోనియా బుజ్జగింపు: తగ్గిన కేంద్ర మంత్రులు
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుజ్జగింపులతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు రాజీనామాలపై వెనక్కి తగ్గారు. మంత్రులు పళ్లం రాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిలు అధినేత్రితో శనివారం భేటీ అయ్యారు. రాజీనామాలపై తొందరపడొద్దని సూచించారు. దీంతో వారు మెత్తబడ్డారు.
వారిద్దరికి సోనియా సోనియా హితవు పలికారు. మంత్రులుగా ఉన్నప్పుడే ప్రజల సమస్యలపై సాధికారింగా పోరాడి సాధించే హక్కు ఉంటుందని సూచించారట. రాష్ట్ర విభజన వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయని, నదీ జలాలు, ఉపాధి కల్పన, రాజధాని, ఉన్నత విద్యావకాశాలతో పాటు అనేక సమస్యలున్నాయని పళ్లం రాజు వివరించారు.

పదేళ్లలో రాజధాని నిర్మించడం అసాధ్యమని చెప్పారు. తన నియోజకవర్గంలో ప్రజలు ఉధృతంగా ఆందోళన చేస్తున్నారని, అందుకే వారి మనోభావాలకు అనుగుణంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తాను మేడమ్కు చెప్పినట్లు ఆయన వివరించారు.
అయితే జీవోఎంలో ఉంటే ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు మరింత అధికారం ఉంటుందంటూ సోనియా బుజ్జగించారు. అధికారం ఉంటేనే అనుకున్నది సాధించుకునేందుకు వీలవుతుందని సోనియా చెప్పినట్లు కోట్ల తెలిపారు. రాజీనామా విషయంలో తొందరపడొద్దని తనకు సూచించారన్నారు. దీంతో చెప్పకుండానే రాజీనామా చేసినందుకు మేడమ్కు సారీ చెప్పానన్నారు.
తాను కాంగ్రెస్లోనే ఉంటానని, తమ కుటుంబం తొలి నుంచీ కాంగ్రెస్కు కట్టుబడి ఉందని చెప్పినట్లు కోట్ల తెలిపారు. కాగా విభజన సమస్య అంత సులభంగా పరిష్కారమయ్యేది కాదని కోట్ల అన్నారు. రాష్ట్ర విభజనకు ప్రజలను మానసికంగా సన్నద్ధం చేయకుండా, సమస్యలకు పరిష్కారాలు చూపకుండా నిర్ణయాలు తీసుకోవడమే సమస్యలను రేకెత్తించిందని వివరించారు.












Click it and Unblock the Notifications