పోలీసుల పేరుతో యువతిపై గ్యాంగ్ రేప్: మరో నలుగురి అరెస్టు
గుంటూరు: గుంటూరు జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్టు చేశారు. గత నెల 26న అర్ధరాత్రి వేమూరు శివారులోని పొలాల్లో కొల్లూరుకు చెందిన యువతిపై కొంత మంది సామూహికంగా అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. తొలుత ఈ కేసులో నలుగురిని నిందితులుగా గుర్తించగా, మరో ఇద్దరు కూడా ఈ దారుణానికి సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఘటన స్థలంలోనే ఇద్దరిని పట్టుకున్న పోలీసులు మిగిలిన నలుగురిని బుధవారం అరెస్ట్టు చేశారు. నిందితులలో ఆర్మీ జవాను కూడా ఉన్నాడు. తెనాలి డీఎస్పీ సీహెచ్ సౌజన్య మీడియా సమావేశంలో తెలిపిన వివరాల మేరకు - కొల్లూరుకు చెందిన యువతి, మరో యువకుడు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను బంధువులు అంగీకరించనందున వివాహం చేసుకునేందుకు గత నెల 26న కొల్లూరులో లారీ ఎక్కి వేమూరులో రైల్వే గేటు వద్ద దిగారు.
రైల్వే స్టేషన్ సమీపంలో వేచి ఉన్న వీరిని అటుగా బైక్లపై వచ్చిన యువకులు గమనించి పోలీసుల పేరుతో బెదిరించారు. అనంతరం యువతిని బలవంతంగా తీసుకు వెళ్లి సమీప పొలాల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతితో పాటు ఉన్న యువకుడు పోలీసులకు 100 నెంబర్ ద్వారా సమాచారం అందించడంతో వేమూరు ఎస్ఐ జీ.మోహన్ తన సిబ్బందితో నేర స్థలానికి వెంకటేష్, సుధాకర్ అనే ఇద్దరిని పట్టుకున్నారు. మరో ఇద్దరి కోసం దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసులో తొలుత నలుగురిని నిందితులుగా పోలీసులు భావించినప్పటికీ మరో ఇద్దరు ఉన్నట్లు విచారణలో తేలింది. రేపల్లెకు చెందిన ఆర్మీ జవాను రాతంశెట్టి సుధాకర్, అడుసుమల్లి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేష్, భూపతి గోపి, వెంకటరత్నం, నెల్లూరు అనిల్కుమార్, గూడవల్లి వెంకట ప్రసాద్ 26న తెనాలి వచ్చి మద్యం తాగారు.
తిరిగి వెళుతూ ఒక వేశ్యను మాట్లాడుకుని తమతో పాటు తీసుకు వెళ్లారు. దారిలో మద్యం తాగేందుకు వేమూరు శివారులోని పొలాల్లో ఆగారు. అడుసుమల్లి వెంకటేశ్వరరావు, భూపతి మళ్లీ మద్యం కోసం వేమూరు వస్తుండగా రైల్వే గేటు వద్ద కొల్లూరుకు చెందిన యువతి యువకుడు కనిపించారు. వారిని వెంబడించి పోలీసులమని బెదిరించారు. అనుమానం వచ్చిన జంట ప్రశ్నించడంతో వెంకటేష్ ఫోన్ ద్వారా ఆర్మీ ఉద్యోగి రాతంశెట్టి సుధాకర్ను అక్కడికి రప్పించాడు.
సుధాకర్ తన వద్ద ఉన్న ఆర్మీ గుర్తింపు కార్డు చూపించి బెదిరించాడు. యువతిని బలవంతంగా బైక్పై ఎక్కించుకుని పొలాలలోకి తీసుకు వెళ్లి ఆమెపై ఆత్యాచారానికి పాల్పడ్డారు. దర్యాప్తులో గూడవల్లి వెంకట ప్రసాద్, నెల్లూరు అనిల్ కుమార్ అనే ఇద్దరు వీరికి సహకరించినట్లు తేలింది. దీంతో వీరితో సహా ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులపై నిర్భయ చట్టంతో పాటు కిడ్నాప్ కేసు, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీస్ యాక్టు, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు జరిపి నిందితులను అరెస్ట్ చేసిన రూరల్ సీఐ యూ.రవిచంద్ర, వేమూరు ఎస్ఐ జీ.మోహన్, కొల్లూరు ఎస్ఐ అద్దంకి వెంకటేశ్వర్లు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. మీడియా సమావేశంలో తెనాలి వన్ టౌన్ సీఐ బీ.శ్రీనివాసరావు, రూరల్ ఎస్ఐ శివరామకృష్ణ పాల్గొన్నారు.