ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు - మొత్తం సంఖ్య నాలుగు : విదేశాల నుంచి రాక..!!
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ క్రమేణా తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరిస్తోంది. ఏపీలో తాజాగా ఇద్దరికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో..ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సదరు మహిళ ఈనెల 19న కువైట్ నుంచి విజయవాడకు చేరుకుంది. అక్కడి నుంచి స్వస్థలం అయినవిల్లి మండలం నేదునూరు వెళ్లింది. ఆమె నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపగా ఒమిక్రాన్ నిర్ధారణ అయింది.

దుబాయ్ వచ్చిన వారిలో ఓమిక్రాన్
ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా అదనపు డీఎంహెచ్వో వెల్లడించారు. మహిళ భర్త, పిల్లలకు కరోనా నెగటివ్ వచ్చిందని.. మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. బాధితురాలు ఇటీవలే గల్ఫ్ నుంచి వచ్చినట్టుగా చెబుతున్నారు అధికారులు.. దీంతో, అప్రమత్తమైన అధికారులు.. ఆమెతో కాంటాక్ట్ అయినవాకి టెస్ట్లు చేయడంపై ఫోకస్ పెట్టారు. ఇక, ఇదే సమయంలో యూఏఈ నుండి విశాఖ వచ్చిన 33 సంవత్సరాల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. కొద్ది రోజుల క్రితమే యూఏఈ నుంచి ఏపీకి వచ్చారు.

ఏపీలో నాలుగుకు పెరిగిన కేసుల సంఖ్య
ఇప్పుడు ఇద్దరూ క్వారంటైన్ లో ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. గతంలో రెండు కేసుల్లో ఒకటి విజయనగరం.. రెండో కేసు తిరుపతిలో గుర్తించారు. వారిలో ఎటువంటి లక్షణాలు లేవు. అయినా, క్వారంటైన్ లో ఉంచి..పూర్తిగా నయమైన తరువాత పంపారు. ఇతర రాష్ట్రాల విమానాశ్రయాలకు విదేశాల నుంచి వచ్చిన వారిలో ఈ కేసులు గుర్తిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. కేంద్రం తాజా ఆదేశాల మేరకు ప్రతీ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇద్దరినీ క్వారంటైన్ కు తరలింపు
కరోనా నిర్దారణ అయిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపుతున్నారు. అక్కడి నుంచి నివేదికలు వచ్చే వరకు వారిని క్వారంటైన్ లోనే ఉంచుతున్నారు. అయితే, కేంద్రం మార్గదర్శకాల మేరకు నూతన సంవత్సరం వేడుకల పైన ప్రభుత్వం ఆంక్షల దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో కేసుల సంఖ్య తక్కువగా ఉండటంతో.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా నియంత్రణ కొనసాగించాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications