మరో రెండు జగన్ వికెట్లు డౌన్: అప్పుడే చేరేవాడినంటూ ట్విస్ట్
విజయవాడ: ఊహించినట్లుగానే మరో ఇద్దరు శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో శుక్రవారంనాడు తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఎమ్మెల్యేలతోపాటు ప్రత్తిపాడు నియోజకవర్గంలోని 13 మంది సర్పంచులు, ఒక జెడ్పీటీసీ, పలువురు ఎంపీపీలు, ఎంపీటీసీలు పార్టీలో చేరారు. తాను అప్పుడే టిడిపిలోకి వస్తానంటే చంద్రబాబు ఆగాలని చెప్పారని సునీల్ ట్విస్ట్ ఇచ్చారు. టిడిపి తనకు సొంత ఇల్లు అని ఆయన అన్నారు.
రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, ఆర్థికంగా పక్క రాష్ర్టాలతో పోలిస్తే చాలా వెనుకబడ్డామని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రతిపక్షం అడ్డుకుంటోందని, రోజూ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.

కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని, ఇది రాజకీయాలు చేసే సమయం కాదని ఆయన అన్నారు, ప్రతిపక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉక్కు సంకల్పంతో ముందుకు సాగాలని, ఎక్కడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు.
అభివృద్ధికి అడ్డుపడొద్దని ఎన్నిసార్లు చెప్పినా ప్రతిపక్షం తన తీరు మార్చుకోవడం లేదనిఅ అన్నారు. ప్రతిపక్ష నేత జగన్ తీరు వల్లే ఆ పార్టీకి చెందిన నేతలు టీడపీలోకి వస్తున్నారని చెప్పారు.
ఎమ్మెల్యేగా గెలిచిన వారం రోజులకే చంద్రబాబును కలిసి ఆశీర్వాదం తీసుకున్నానని, పార్టీలోకి వస్తానని కోరానని సునీల్ చెప్పారు. అయితే సరైన సమయం వచ్చే వరకూ ఆగాలని ఆయన సూచించడంతో ఇప్పటివరకూ ఆగాల్సి వచ్చిందని చెప్పారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేందుకు ఇంకా చాలామంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీడీపీలోకి వస్తున్నందుకు రూ.20కోట్లు, 30కోట్లు తీసుకుంటున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు.
ఎమ్మెల్యేలు పార్టీ వీడిపోతున్నారని భయంతోనే వైసీపీ నేతలు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అన్నికోట్లు తీసుకెళ్లాలంటే మినీ లారీలు తెచ్చుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సాక్షిలో పత్రికలో తప్పుడు ప్రచారం ఆపాలన్నారు. లేనిపక్షంలో వైసీపీలో తమకు జరిగిన అవమానాలను బహిర్గతం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. లోకేశ్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబును కోరారు.
టీడీపీతో తనకు మంచి అనుబంధం ఉందన్నారని పరుపుల సుబ్బారావు అన్నారు. గతంలోనూ చాలాకాలం తాను పార్టీలో పనిచేశానని, ఇప్పుడు తిరిగి పార్టీలో చేరడం సంతోషంగా ఉందని చెప్పారు.
టీడీపీలో కుటుంబ వాతావరణం ఉంటుందని, వైసీపీలో అలాంటి వాతావరణం ఉండదని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. జగన్ ఎమ్మెల్యేలతో మాట్లాడరని, కనీసం వారి వైపు కూడా చూడరని చెప్పారు.












Click it and Unblock the Notifications