అమెరికాలో తెలుగువారిపై మరో దారుణం: రక్తపు మడుగులో తల్లీ, కొడుకు
అమెరికాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లోనే ఇద్దరు తెలుగువారు దారుణ హత్యకు గురయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన నర్రా హనుమంతరావు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి ఆయన భార్య, కొడుకు(6) రక్తపు మడుగులో వి
న్యూజెర్సీ: అమెరికాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ ఇంట్లోనే ఇద్దరు తెలుగువారు దారుణ హత్యకు గురయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన నర్రా హనుమంతరావు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి ఆయన భార్య శశికళ(40), కొడుకు హనీశ్ సాయి(7) రక్తపు మడుగులో విగత జీవులుగా పడివున్నారు.
హనుమంతరావు, శశికళకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వారు అమెరికాలో తొమ్మిదేళ్లుగా నివసిస్తున్నారు. హనుమంతరావు ఓ కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తుండగా.. శశికళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. బుధవారం సాయంత్రం శశికళ బాబును స్కూల్ నుంచి తీసుకొచ్చారు.
సాయంత్రం ఏడు గంటలకు హనుమంతరావు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమారుడు విగతజీవులుగా పడివున్నారు. వారిని గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించిన ఆయన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
దోపిడీకి వచ్చిన దుండగులే ఈ దాడికి పాల్పడ్డారా? లేక ఇంకెవరైనా జాత్యహంకారాలు దాడికి పాల్పడ్డారా? అనేది తేలాల్సివుంది. ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెంలోని హనుమంతరావు బంధువులకు ఈ మేరకు సమాచారం అందింది. కుటుంబసభ్యుల మృతితో వారి కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలోని తానా సభ్యులతో ఎమ్మెల్యే సాంబశివరావు సంప్రదింపులు జరుపుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, తెలుగు ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్య ఘటన మరువక ముందే ఈ దారుణం చోటు చేసుకోవడం తెలుగు ప్రజల్లో భయాందోళనకు గురిచేస్తోంది. వరుసగా తెలుగువారిపై జరుగుతున్న దాడులు తెలుగు రాష్ట్రాల్లోని వారి కుటుంబసభ్యులు, బంధువులను కలవరానికి గురిచేస్తున్నాయి.