రెండేళ్ల పాలన తర్వాత..! చంద్రబాబు ముందున్న అతిపెద్ద సవాల్..
హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోవడం, తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం.. ఇదంతా జరిగి ప్రస్తుతం రెండేళ్లు పూర్తయిన తరుణంలొ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాలనపై విశ్లేషణలు చేస్తున్న సందర్భమిది.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రెండేళ్ల పాలనను గమనిస్తే.. జూన్ 8వ తేదీన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు, అందకోసం హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లి ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి కాగానే తిరిగి హైదరాబాద్ బాట పట్టారు.
ఆయన హైదరాబాద్ కే తిరుగు పయనమవడానికి కారణం.. ఏపీకి అంటూ ప్రత్యేక రాజధాని ఏది లేకపోవడం, కనీసం సీఎం కార్యకలాపాల కోసమైనా అక్కడ ఓ కార్యాలయం లేకపోవడం. దీంతో హైదరాబాద్ కేంద్రంగానే రాష్ట్ర పాలనా విభాగాలను పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏపీ సీఎం చంద్రబాబుది.

ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా మరో పదేళ్ల పాటు ఏపీ ప్రభుత్వ కార్యకలాపాలను హైదరాబాద్ ను కేంద్రంగా నిర్వహించుకుంటూ.. అదే సమయంలో కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముంది.
హైటెక్ బాబుగా టీడీపీ వర్గాలు అభివర్ణించే సీఎం చంద్రబాబు కూడా ఏపీ రాజధానిని అంతే భారీ స్థాయిలో నిర్మించాలనే యోచనలో ఉన్నారు.కృష్టా నది ఒడ్డున ప్రపంచ రాజధానులను తలదన్నేలా రాజధాని నిర్మించాలనేది ఆయన ఆలోచన. అయితే, అరకొర నిధులతో నెట్టుకొస్తున్న ఏపీ ప్రభుత్వానికి వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మాణాన్ని ఆచరణలో పెట్టడం మాత్రం కష్టంగానే మారింది.
పరిణామాలు ఇలా కొనసాగుతుండగానే.. మే 17, 2016న ప్రధాని మోడీతో భేటీ అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. సీనియర్ ముఖ్యమంత్రిని అయి ఉండి నిధుల కోసం కేంద్రాన్ని అడుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అదే సమావేశంలో రాష్ట్ర విభజనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర విభజన శాస్త్రీయంగా జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం సరైన రీతిలో విభజన చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. కాగా, ఆర్థికంగా వెనకబాటును చవిచూస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడంతో కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులపైనే చంద్రబాబు రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్దిని అంచనా వేయొచ్చనేది పలువురి అభిప్రాయం.
ఇకపోతే ప్రస్తుత ఏపీ కార్యకలాపాలన్ని హైదరాబాద్ సచివాలయం వేదికగానే కొనసాగుతున్నాయి. కాగా, వీలైనంత త్వరగా పాలనా యంత్రాంగనంతా అమరావతికి మార్చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న సీఎం చంద్రబాబు ఇందుకోసం జూన్ 27వ తేదీ డెడ్ లైన్ గా నిర్ణయించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆలోచన ఇలా ఉంటే ఏపీ ఉద్యోగులు మాత్రం అమరావతి వెళ్లడానికి అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారింది.
ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు మాత్రం ఏడాది క్రితమే తన మకాంని అమరావతికి మార్చుకుని అక్కడినుంచే ప్రభుత్వ వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారంతా అభికృద్ది అంతా హైదరాబాద్ కేంద్రంగానే చేయడంతో ఈ సమస్య తలెత్తిందన్న వాదన కూడా ఉంది.
మొత్తానికి గతంలో జరిగిన ఆ అలసత్వం వల్ల ఇప్పటికైనా రాష్ట్రంలో ఒక్క రాజధాని మాత్రమే కాకుండా మిగతా నగరాలను, పట్టణాలను కూడా అభివృద్ది చేయాలనే ప్రభుత్వం ఆలోచిస్తోంది. రెండేళ్ల పాలన పూర్తయినా చేయాల్సిన పనులు చాలానే మిగిలిపోయి ఉండడంతో, భవిష్యత్తులో టీడీపీ ఏ మేర తమ హామిలను నిలబెట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టడమనేది ఇప్పుడు టీడీపీ ముందున్న పెద్ద సవాల్.












Click it and Unblock the Notifications