6 నెలలుగా...మైనర్ బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం:గృహిణిపై దాడి
ఒంగోలు:దేశంలో కీచకులు చెలరేగిపోతున్నారు. చిన్నాపెద్దా తేడాలేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. నిందితులపై చర్యల గురించి ప్రభుత్వాలు ఎంత ఊదరగొడుతున్నా కామాంధుల్లో ఇసుమంతైనా మార్పు కనపడటం లేదు.
తాజాగా ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం నీలకంఠాపురంలో మరో దారుణం వెలుగుచూసింది. మైనర్ బాలికను మాయమాటలు చెప్పో...భయపెట్టో ఆరు నెలలుగా ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. అయితే అనుకోకుండా ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు విషయం తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది.
మరోవైపు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక గృహిణిపై ముగ్గురు యువకులు అత్యాచార యత్నానికి ప్రయత్నించటమే కాకుండా ప్రతిఘటించిన ఆమెపై బీరు సీసాతో దాడిచేసి గాయపరచిన సంఘటన చోటుచేసుకుంది. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధారంగానగర్ కు చెందిన వివాహిత బహిర్భూమి వెళుతుండటం గమనించిన ఇప్పటం, గుండిమెడ గ్రామాలకు చెందిన ప్రసాద్, సందీప్, మరో యువకుడు ఆమెని అనుసరించి పట్టుకొని పొదల్లోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు.
అప్పటికే మద్యం మత్తులో ఉన్న వీరు ఆమె తమని అడ్డుకోవడంతో ఆగ్రహించి ఆమెపై తమవద్ద ఉన్న బీరుసీసాతో దాడి చేశారు. దీంతో వివాహిత పెద్దగా కేకలు వేయటంతో పరిసర ప్రాంతంలోని మహిళలు వచ్చి అడ్డుకోబోయారు. అయితే ఈ యువకులు వారిపైనా దాడికి దిగారు. అప్పటికే అక్కడకు చేరుకున్న స్థానికులు వీరిలో ఇద్దరు యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.