టీడీపీకి రేపు బిగ్ డే- ఇద్దరు వైసీపీ ఎంపీలు, ఓ ఎమ్మెల్యే చేరికలు..!
ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమవుతున్న వేళ రాజకీయ పార్టీల్లో ప్రజాప్రతినిధుల ఫిరాయింపులు పెరుగుతున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువగా ఉన్నా.. ఓ మోస్తరుగా చేరికలు ఉంటున్నాయి. ఇదే క్రమంలో అధికార వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో సీట్లు కోల్పోయిన ఇద్దరు ఎంపీలు, ఓ ఎమ్మెల్యే రేపు (శనివారం) చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. అనంతరం వీరికి టీడీపీ సీట్లు కేటాయించబోతోంది.
వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా మైలవరం అసెంబ్లీ సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు ఈసారి సీటు దక్కేలేదు. చంద్రబాబు, పవన్ పై తీవ్ర విమర్శలు చేయకపోవడంతో ఆయన్ను అనుమానించిన వైసీపీ.. ఈసారి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరబోతున్నారు. రేపు హైదరాబాద్ లో చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారు. అనంతరం ఆయనకు మైలవరం టికెట్ కేటాయించనున్నారు.

అలాగే పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్ సభ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు కూడా ఈసారి సిట్టింగ్ సీటు మరోసారి దక్కలేదు. ఆయన్ను గుంటూరు లోక్ సభ సీటు నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ ఆఫర్ ఇచ్చారు. అయితే దాన్ని తిరస్కరించిన ఆయన.. పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. రేపు పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగే రా కదలిరా బహిరంగసభలో ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా చేరతారు.
మరోవైపు నెల్లూరు వైసీపీ ఎంపీ ఇన్ చార్జ్ గా ప్రకటించిన కీలక నేత, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పేసిన ఆయనకు టీడీపీ ఆఫర్ ఇచ్చింది. దీంతో ఆయన రేపు నెల్లూరులో జరిగే బహిరంగసభలో టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నెల్లూరు ఎంపీగా తనను ఎంపిక చేసిన జగన్.. ఆ తర్వాత ఎమ్మెల్యేల మార్పుల్ని తనకు తెలియకుండానే చేసేస్తుండటంతో అసంతృప్తికి గురయ్యారు. చివరికి వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications