ఉమా మాధవరెడ్డి అలక: టిడిపికి రాజీనామా యోచన
నల్లగొండ: టికెట్ల కేటాయింపులో తెలుగుదేశం పార్టీ నల్లగొండ జిల్లా భువనగిరి శాసనసభ్యురాలు ఉమా మాధవరెడ్డి అలక వహించారు. టికెట్ల కేటాయింపులో తన వర్గానికి అన్యాయం జరిగిందనే అసంతృప్తిని ఆమె వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం తెలంగాణలోని 27 శాసనసభా స్థానాలకు, మూడు లోకసభ స్థానాలకు తొలి విడతగా అభ్యర్థులను ప్రకటించారు. భువనగిరి శాసనసభా స్థానానికి తిరిగి ఉమా మాధవరెడ్డిని ఆయన ఎంపిక చేశారు.

నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ శాసనసభా స్థానాన్ని వెంకటేశ్వర్లుకు, దేవరకొండ స్థానానికి బిల్యా నాయక్ను, హుజూర్ నగర్ స్థానానికి వంగాల స్వామిగౌడ్ను, సూర్యాపేటకు పటేల్ రమేష్ రెడ్డిని చంద్రబాబు ఎంపిక చేశారు.
ఈ స్థితిలో తన వర్గానికి టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఉమా మాధవరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన వర్గాన్ని కాపాడుకునే విషయంలో తన మనోభావాలను చంద్రబాబు పరిగణనలోకి తీసుకోలేదని ఆమ మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు, ఉమా మాధవరెడ్డికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది.
తనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా చంద్రబాబు జాబితాను ప్రకటించారని ఉమా మాధవరెడ్డి అంటున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో మోత్కుపల్లి నర్సింహులు వర్గానికి పెద్ద పీట వేసినట్లు ఆమె భావిస్తున్నారు. తన వర్గానికి చందర్ రావు వంటి వారి పేర్లను ప్రకటించకపోవడం పట్ల ఆమె కినుక వహించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications