పోలీసులను పావుగా వాడుకుని: నాని అరెస్టు వెనుక చంద్రబాబు హస్తం
అమరావతి: చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ధైర్యంగా ఎదుర్కొలేక పోలీసులను పావుగా వాడుకుంటోందని శాసనమండలిలో వైసీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారంటూ సోమవారం ఆయన మండిపడ్డారు.
వివరాల్లోకి వెళితే, కృష్ణా జిల్లాలోని గుడివాడలోని వైసీపీ కార్యాలయాన్ని పోలీసులు ఆదివారం బలవంతంగా ఖాళీ చేయంచి, అడ్డుకున్న వైసీపీ ఎమ్మెల్యే కొడాని నానిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే కొడాలి నానిని గుడివాడ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకొచ్చి పూచీకత్తుపై సాయంత్రం విడుదల చేశారు.
వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఖాలీ చేయించడం అనేది సివిల్ వ్యవహారమని, కానీ దాదాపు 200 మంది పోలీసులు ఎమ్మెల్యే నానిపై ఈ దాడికి పూనుకోవడం ఏంటనీ ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తం వ్వవహారం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తం ఉందని ఆయన విమర్శించారు.
వైసిపి కార్యాలయం ఉన్న భవనం గొడవపై మాట్లాడుతూ.. తాను త్వరలోనే ఖాళీ చేస్తానని చెప్పానని, శనివారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు గుడివాడలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బలవంతంగా ఖాళీ చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.
చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. సిగ్గుమాలిన రాజకీయాలు మాని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. చంద్రబాబు ఉడుత ఊపులకు నేను లేదా జగన్ భయపడే ప్రసక్తి లేదన్నారు.
చట్ట ప్రకారం తనకు ఉన్న హక్కులతో త్వరలోనే అక్కడి నుంచి తన కార్యకలాపాలు కొనసాగిస్తానని చెప్పారు. దివంగత ఎన్టీఆర్ ఫోటో, వైయస్ ఫోటో పక్క పక్కన పెట్టడం వల్లే వివాదం సృష్టిస్తున్నారన్నారు.