గుంటూరు జీజీహెచ్ శిశువు మృతిపై ఉమ్మారెడ్డి: మంత్రి ఆసుపత్రిలో నిద్ర ప్రచారానికేనా..!
హైదరాబాద్: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గతంలో చేపట్టిన ఆసుపత్రిలో నిద్ర కార్యక్రమం ప్రచార ఆర్భాటాలకే తప్ప రోగులకు ఉపయోగం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో పది రోజుల పసికందును ఎలుకలు పీక్కుతిన్న ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించాల్సిన మంత్రలు బాధను వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు.
బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని మండిపడ్డారు. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలపై హైలెవల్ కమిటీ వేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు.
డిప్యూటీ సీఎం కేఈ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. అసలు భూ సేకరణకు కేబినెట్ ఆమోదం ఉందా? అనే అనుమానం కలుగుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈనెల 29న తలపెట్టిన బంద్ను విజయవంతం చేసి మన నిరసనను కేంద్రానికి తెలియజేద్దామని అన్నారు.
ప్రత్యేక హోదాపై ఉద్యం ఆగదు: మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేంత వరకు ఉద్యమాలు ఆగవని, ప్రత్యేక హోదా సాధించుకునేంత వరకు అలుపు లేకుండా శ్రమించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అనంతపురంలో జరిగిన సమావేశంలో గురువారం ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో ఈ నెల 29న చేపట్టనున్న రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి మొండిచేయి చూపిన కేంద్ర ప్రభుత్వంలో తన మంత్రులను కొనసాగిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా ప్రస్థావనే మరిచారని విమర్శించారు.