దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ...బిజెపిని గద్దె దింపడమే లక్ష్యం:వామపక్ష నేతలు
అనంతపురం:దేశంలో అప్రకటిత ఎమర్జన్సీ కొనసాగుతోందని కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ,సిపిఎం ప్రధాన కార్యదర్శులు సురవరం సుధాకరరెడ్డి, సీతారాం ఏచూరి చెప్పారు. సిపిఐ నాయకుడు నీలం రాజశేఖర్రెడ్డి శత జయంతి ఉత్సవాలు సోమవారం అనంతపురంలో ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి వామపక్ష పార్టీల జాతీయ నేతలు సురవరం సుధాకరరెడ్డి, సీతారాం ఏచూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యాలయంలో నీలం రాజశేఖర్రెడ్డి విగ్రహా విష్కరణ చేశారు. అనంతరం స్థానిక లలిత కళాపరిషత్ హాలులో సిపిఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ అధ్యక్షతన జరిగిన సభలో కమ్యూనిస్ట్ నేతలు ప్రసంగించారు.
ఈ సందర్భంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఒక వైపు రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ వేగంగా నాశనం చేస్తోందని, మరోవైపు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల దృష్టి మరల్చడం ద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. నోట్ల రద్దు, జిఎస్టి మూలంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. తద్వారా ఉపాధి అవకాశాలు సైతం తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కొత్తవి కల్పించలేకపోగా ఉన్నవి పోయేటట్టు చేసిందని ఎద్దేవా చేశారు.
పైగా అమెరికా సామ్రాజ్యవాదానికి బిజెపి ప్రభుత్వం సాగిలపడి పనిచేస్తోందని ఎద్దేవా చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా అందరినీ ఐక్యం చేసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. మోడీ బలమైన వాడని ఆయనకు ధీటైన వారెవ్వకూ లేరని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ...2004 కు ముందు వాజ్పేయికి ధీటైన వారెవ్వరూ లేరని ఇలాగే ప్రచారం జరిగిన విషయాన్ని సీతారాం ఏచూరి గుర్తు చేశారు. ఆ తరువాత మనోహన్ సింగ్ పిఎం అయ్యి పదేళ్లూ కొనసాగారన్నారు. దేశంలో సమర్థులైన నాయకులకేమీ కొదవ లేదని...ప్రత్యామ్నాయం లేదనే వాదనల్లో నిజం లేదన్నారు. ప్రత్యామ్నాయమన్నది విధానపరంగానే ఉంటుంది తప్ప వ్యక్తులనిబట్టి కాదన్నారు. ప్రత్యామ్నాయ విధానాలకై పోరాడటమే నీలం రాజశేఖర్రెడ్డి వంటి వారికిచ్చే నివాళి అని చెప్పారు.
అనంతరం సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకొచ్చిన బిజెపి కార్పొరేట్ల ప్రభుత్వంగా పనిచేస్తోందని విమర్శించారు. దళితులు, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో గోరక్షణ పేరుతో జరిగిన దాడుల్లో 33 మంది చనిపోతే అందులో 25 మంది ముస్లిములు ఉన్నారని తెలిపారు. దేశ సంపదలో 73 శాతం పది శాతం మంది చేతుల్లోనే కేంద్రీకృతమైందని చెప్పారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేక విధానాలనే అవలంభిస్తోందని విమర్శించారు. నీలం శత జయంతి ఉత్సవాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ...చివరగా విజయవాడలో రెండు రోజులపాటు జాతీయస్థాయి సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు.