కిటుకేమిటి, మోడీకి ఆ భయం ఉందా: ఎపికి హోదాపై ఉండవల్లి
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై కిటుకు ఏమిటని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రధాని మోడీని ప్రశ్నించారు. పెట్రోలియం పరిశ్రమలు గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిపోతాయని ప్రధాని మోడీ భయపడుతున్నారా అని ఆయన అడిగారు.
గుజరాత్లో పెట్రోలియం పరిశ్రమలున్నాయని, అయితే ఆంధ్రప్రదేశ్లో దానికి సంబంధించిన వనరులున్నాయని, ప్రత్యేక హోదా ఇస్తే తమకు లభించే రాయితీల కారణంగా వనరులున్న చోటికి తరలిపోతే మంచిదని ఆ కంపెనీలు అభిప్రాయపడే అవకాశం ఉందని, దానివల్ల మోడీ ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదేమోనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎవరిని మోసం చేస్తున్నారని ఆయన అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించడం లేదని, తెలంగాణ రాష్ట్ర సమితి సైతం ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఆలోచనను సమర్థించిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు మాటిమాటికి పారదర్శకత గురించి మాట్లాడుతారని, తాను ఆరు లేఖలు రాస్తే కనీసం అందిందనే సమాధానం కూడా ఇవ్వలేదని అన్నారు.
ఏమైనా అంటే ఉండవల్లి ఊసరవెల్లి, గడ్డి తింటున్నారా, అన్నం తింటున్నారా అని అంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదాపై చర్చించదని అన్నారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ మూడు రోజులు కాదు, మూడు నిమిషాలే సమావేశమైనా ఆశ్చరం లేదని అన్నారు.
లోకసభపై, రాజ్యసభపై నమ్మకం పోయేలా ఉందని అన్నారు. మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత ఘోరంగా మోసం చేస్తుందో పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో చెబుతానని ఆయన అననారు. బిజెపి వాళ్లు చెప్పేది నమ్మవద్దని ఆ రాష్ట్రాల ప్రజలకు చెబుతానని అన్నారు.
టిడిపి కేంద్రాన్ని ఎందుకు నిలదీయదని అడిగారు. బ్లాక్మెయిలా, ఇద్దరి మధ్య అవగాహనా అని ఆయన అడిగారు. చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయిలో ఎలా ఉన్నా జాతీయ స్థాయిలో చంద్రబాబును మేధావి అని అనుకుంటారని, చంద్రబాబు ఎందుకు కేంద్రాన్ని అడగలేకపోతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు ఎలాగూ నిజం చెప్పరని, చంద్రబాబు అయినా వాస్తవాలు చెప్పాలని ఆయన అన్నారు.
ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనే పద్ధతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, అందుకే ప్రశ్నించాల్సి వస్తోందని ఉండవల్లి అన్నారు. తాను గ్లామర్ ఉన్న నాయకుడిని కానని, అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా సభలు పెడితే ప్రజలు వస్తారని అనుకోవడం లేదని, తన నియోజకవర్గం వరకు తాను పాల్గొంటానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications