లక్షల కోట్లున్నాయంటే జగన్ ఎంజాయ్ చేస్తున్నారు: బాబునూ ఏకేసిన ఉండవల్లి
హైదరాబాద్: మాజీ పార్లమెంటుసభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేగాక, ఆయన ప్రతిపక్ష పార్టీని కూడా వదల్లేదు. ప్రజావ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందంటూ మండిపడ్డారు.
హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీ ప్రభుత్వం ప్రజలకు నిజాలు ఎందుకు చెప్పలేకపోతోందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాను ఎవరు డిమాండ్ చేస్తే వారిపై టీడీపీ నేతలు దేశద్రోహి ముద్ర ఎందుకు వేస్తున్నారని ఆయన నిలదీశారు.
ప్రతిపక్ష నేతగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదాపై ప్రభుత్వాన్ని నిలదీస్తే... ప్రతి ఒక్కరూ ఆయన లక్ష కోట్ల రూపాయలు దోచేశాడని అంటున్నారని అన్నారు. టిడిపి నేతలు ఆరోపణలు చేస్తుంటూ.. జగన్ ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటివరకు ఆయనపై నమోదైన ఆర్థిక నేరాల కేసుల్లో కేవలం 13,000 కోట్ల రూపాయలపై అభియోగాలు ఉన్నాయని ఆయన తెలిపారు. వాటికి సరిపడా జైలు శిక్షను జగన్ ఇప్పటికే అనుభవించేశాడని ఆయన అన్నారు. తనకు తెలిసి 16 నెలలపాటు జైల్లో ఉన్న ఏకైక వ్యక్తి జగన్ అని ఆయన చెప్పారు.
లేదు జగన్ లక్ష కోట్లు దోచుకున్నాడని టిడిపి నేతలు పదేపదే ఆరోపించేట్టయితే... ఆ లక్ష కోట్లు ఏ ఏ కేసుల్లో ఎంతెంత దోచుకున్నాడు? ఏ కేసులో కోర్టు ఎంత సీజ్ చేసింది? అందులో అక్రమ సంపాదన ఎంత? ఈ మొత్తాన్ని ఎలా దోచుకున్నాడు? అన్న వివరాలను ప్రభుత్వమే ప్రజలకు చెప్పాలని ఆయన డిమండ్ చేశారు.
అంతేగాక, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందని అన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే ఓట్లు వేయకుండా సభను అప్రజాస్వామిక రీతిలో జరిపారని మండిపడ్డారు. పునర్విభజన చట్టంలో చెప్పిన అంశాలను కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం, ప్రతిపక్షాలున్నాయని దుయ్యబట్టారు.
చంద్రబాబు కోర్టులను మ్యానిప్యులేట్ చేయగలడని గతంలో తెలంగాణ ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ స్థాయి వ్యక్తి నేరుగా లైవ్లో చెప్పారని ఆయన గుర్తు చేశారు.
న్యాయవ్యవస్థను మేనేజ్ చేయగలిగిన చంద్రబాబుపై న్యాయపోరాటానికి తాను మూడు పిటిషన్లు దాఖలు చేశానని అన్నారు.
ఈ మూడు పిటిషన్లు కోర్టును రీచ్ అవ్వాలని, అంత వరకు తాను బతికే ఉండాలని కోరుకున్నానని ఆయన తెలిపారు. తాను ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేనని స్పష్టం చేశారు. ఎలక్షన్ పాలిటిక్స్లో ఉండేందుకు తన వయసు సహకరించడం లేదని ఆయన తెలిపారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకున్నానని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications