'పవన్కు జనాలు వస్తారు కానీ, బీజేపీతో జగన్ ఒప్పందం అలా బట్టబయలు!'
విజయవాడ: పవన్ కళ్యాణ్ జనసేన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అజెండా ప్రకటిస్తేనే జనసేన విధానం తెలుస్తుందని చెప్పారు. పవన్ ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.
మరోవైపు, బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సిద్ధంగా లేదన్నారు. ఈ నేపథ్యంలో పవన్ బీజేపీతో కలుస్తారని భావించడం లేదని చెప్పారు. కాపు రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణపై జనసేన తన వైఖరి ప్రకటించాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.

సినీ స్టార్ల మీటింగ్లకు జనాలు వస్తారు, కానీ
పవన్ కళ్యాణ్ సమావేశాలకు పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు తరలి రావడంపై కూడా ఉండవల్లి స్పందించారు. సినిమా స్టార్ల మీటింగులకు వచ్చే జనం, వ్యూయర్ షిప్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కానీ అవి ఎంత వరకు ఓట్లుగా మారుతాయో చూడాలన్నారు.
Recommended Video


జగన్ వ్యూహాత్మకంగా
వైయస్ జగన్ బీజేపీ మద్దతుపై వ్యూహాత్మకంగా మాట్లాడినట్లుగా కనిపిస్తోందని ఉండవల్లి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి మద్దతిస్తానని జగన్ తన ప్రజా సంకల్ప యాత్రలో ప్రకటించారు. దీనిపై ఉండవల్లి స్పందించారు. జగన్ పక్కా ప్లాన్తో మాట్లాడారని అభిప్రాయపడ్డారు. మోడీ హోదా ఇవ్వరనే ఉద్దేశ్యంతో ఆయన ఉన్నారేమో అన్నారు.

బీజేపీతో జగన్ రహస్య ఒప్పందం బట్టబయలు
2019 ఎన్నికల లోపు ప్రత్యేక హోదా ప్రకటిస్తే బీజేపీతో జగన్ రహస్య ఒప్పందం అనే ఆరోపణలు నిజమవుతాయని ఉండవల్లి అన్నారు. జగన్ బీజేపీతో కలిస్తే మంచా లేక చెడా అనే విషయం కాలం నిర్ణయిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలవలేని పరిస్థితిలో జగన్ ఉన్నారని చెప్పారు.

సీఎం పదవి చేపట్టేందుకు జగన్కు అర్హతలు
వైయస్ రాజశేఖర రెడ్డి ఓ మాట ఇస్తే దానిపై నిలబడే వ్యక్తి అని ఉండవల్లి అన్నారు. ఆయన పోలికలే జగన్కు కూడా వచ్చాయని కితాబిచ్చారు. జగన్ ఏదైనా చెబితే చేసి తీరుతారన్నారు. వైయస్కు ఉన్న గుణమే ఆయనను ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపిందన్నారు. పాదయాత్ర నేపథ్యంలో జగన్కు ప్రజామద్దతు అనూహ్యంగా పెరిగిందన్నారు. సీఎం పదవి చేపట్టేందుకు జగన్కు అర్హతలు ఉన్నాయన్నారు.

అసలు అన్యాయం ఎవరు చేశారో చెప్పాలి
ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ వంటి కీలక హామీలను కేంద్రం నెరవేర్చకపోయినా చంద్రబాబు మాట్లాడటం లేదని ఉండవల్లి అన్నారు. ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు తొలగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్నారు. విభజన హామీల అమలుపై చంద్రబాబు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు స్పందిస్తున్నారన్నారు. విభజన హామీలపై సుప్రీంకు వెళ్తామని బాబు చెప్పారని, అంతకంటే ముందు రాష్ట్రానికి ఎవరు అన్యాయం చేశారో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications