ఏపీ విభజనపై ఉండవల్లి పుస్తకం, స్టైల్ మార్చిన వెంకయ్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలను ఒకచోట చేర్చి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం పేరు ‘ఏపీ పునర్వ్యవ్యస్థీకణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిందా?'. తాను రాసిన ఈ పుస్తక ప్రతిని గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ పునర్వవస్థీకరణ బిల్లుపై మరోమారు పార్లమెంటులో చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే అంశాన్ని తాను రాష్ట్రపతికి విన్నవించానని కూడా ఆయన చెప్పారు. పుస్తకంలో రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకున్న చర్యలు, బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చపై పూర్తి వివరాలను పొందుపరిచానని ఆయన పేర్కొన్నారు.
స్టైల్ మార్చిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్టైల్ మార్చారు. దేశ రాజధాని ఢిల్లీలోనే కాక ఎక్కడికెళ్లినా, అచ్చమైన పంచెకట్టుతో కనిపించేవారు. ఎప్పుడో విదేశీ పర్యటనలు మినహా ఆయన వస్త్రధారణలో మార్పు కనిపించదు.
అయితే మొన్న ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఆయన తన స్టైల్ ను మార్చేశారు. ఫ్రాన్స్లో స్మార్ట్ సిటీలపై జరిగిన సదస్సుకు ఆయన సూటు బూటుతో వెళ్లారు. ఫ్రాన్స్ పర్యటనను ముగించుకుని తిరిగి వచ్చిన ఆయనలో బాగానే మార్పు వచ్చినట్లుంది. ఎందుకంటే, గురువారం ఉదయం ఢిల్లీలో మొదలైన స్మార్ట్ సిటీల సదస్సుకు ఆయన సూటు బూటులోనే వచ్చారు.