తెలంగాణ 2,500 కోట్లివ్వాలి, బాబు ఎందుకు తీసుకోవట్లేదు: ఉండవల్లి
విజయవాడ: తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్న విద్యుత్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు డబ్బులు తీసుకోవడం లేదని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ మంగళవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు.
కరెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.2,500 కోట్లు ఇవ్వాలన్నారు. వాటిని ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో పార్టీని కాపాడుకునేందుకే వాటిని తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు.
గతంలో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు, ఇప్పుడు ఎందుకు విడుదల చేయడం లేదన్నారు. సెక్షన్ 8 చట్టం చంద్రబాబుకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు.

ఓటుకు నోటు సీబీఐకి అప్పగించే అవకాశం: జేపీ
ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్పగించే అవకాశముందని లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఈ వ్యవహారాన్ని రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశంగా చూడరాదని, ఇది అవినీతి ఆరోపణలకు సంబంధించిన అంశమన్నారు. గతంలో దివంగత ఇందిరాగాంధీని సైతం పార్లమెంటు పదవి నుంచి తొలగించిందని, అవినీతి కేసుల నేపథ్యంలో లోకసభ సభాపతి సోమనాథ్ ఛటర్జీ 17 మంది ఎంపీలను అనర్హులుగా ప్రకటించారన్నారు.
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఒక రాష్ట్రం పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విఫ్ కూన రవికుమార్ ఆరోపించారు. గవర్నర్ను తప్పించే విషయమై కేంద్రం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. సెక్షన్ 8 చెల్లనప్పుడు విభజన చట్టం మొత్తం చెల్లనట్లే అన్నారు.
నీళ్లు, నిధులు, కరెంట్ అన్నింటినీ చట్టం ప్రకారం తీసుకున్న కేసీఆర్ సెక్షన్ 8 అమలు కాదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీని పైన గవర్నర్ మౌనంగా ఉండటం సరికాదన్నారు. చట్టాలన్నింటిని అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో గవర్నర్ ఉన్నారన్నారు. గవర్నర్ కూడా చిదంబరం నియమంచిన వ్యక్తి అన్నారు.












Click it and Unblock the Notifications